శ్రమ, సంస్కృతి వేరుపడని కాలంలో పుట్టిన శ్రామిక కళలు క్రమంగా అంతరించిపోతున్నాయి. ఆఖరి మనిషితోపాటే కళా ఆగిపోకుండా.. సేకరించి, భద్రపరిచి చరిత్రకు సాక్ష్యాలను సిద్ధం చేస్తున్నది ఆద్యకళ. నిన్నటి సాంస్కృతిక వైభవానికి, రేపటి సాంస్కృతిక పునరుజ్జీవనానికి వారధి కడుతున్నారు.. ఆద్యకళ సారథి ప్రొఫెసర్ గూడూరి మనోజ. ఇటీవల హైదరాబాద్లోని సాలార్జంగ్ మ్యూజియంలో ఆద్యకళ ప్రదర్శన నిర్వహించారామె. ఈ నేపథ్యంలో మనోజ మనోగతం..
సమాజంలో నిచ్చెనమెట్ల కుల వ్యవస్థ ఉందని చిన్నప్పుడే తెలుసు కానీ, ఆ వ్యవస్థలోనే ఆశ్రిత కులాలున్నాయని తెలియదు. మాలలకు నులక చంద్రయ్యలు, మాదిగలకు డక్కలి వాళ్లు ఉన్నారని మాత్రం తెలియదు. ప్రొఫెసర్ జయధీర్ తిరుమల రావు నాయకత్వంలోని ‘ఆద్యకళ’ పరిచయం అయ్యాక ఆదివాసి, గ్రామీణ వృత్తుల వెనుక గొప్ప సంస్కృతి ఉందని అర్థమైంది. బయటి ప్రపంచానికి తెలియని అద్భుతమైన కళలు, సంగీత వాయిద్యాలు, కళా రీతులు, వస్తు సంపద మన దగ్గర ఉన్నదని గ్రహించాను. వాటిని కాపాడుకోవడానికి జరుగుతున్న కృషిలో నావంతుగా పనిచేయాలని ఆద్యకళలో చేరాను. పాలమూరు విశ్వవిద్యాలయంలో ఇంగ్లిష్ అండ్ కల్చరల్ స్టడీస్ ప్రొఫెసర్గా పని చేస్తూనే ఆదివాసి, జానపద కళల అన్వేషణ కోసం అనేక పల్లెలు, గూడేలు తిరిగాను. ఎన్నో ప్రాచీన కళలను గుర్తించాను. కథలు, గాథలు సేకరించాను. ఇవన్నీ అంతరించిపోతే మాత్రం మనం క్షమించరాని నేరం చేసినట్టే. ఆ బాధ్యతతోనే ఆద్య‘కళా ప్రయాణం’ మొదలుపెట్టాను. అందుబాటులో ఉన్న పుస్తకాల్లో ఆదివాసి, జానపద కళల గురించి కొంత సమాచారం ఉంది. కానీ నాలుగో ప్రపంచం (ఉపకులాలు, ఉప తెగల)లో ప్రత్యేకమైన సంస్కృతి ఉంది. వారికే సొంతమైన కళలున్నాయి. వాయిద్యాలున్నాయి. కథలు, ప్రదర్శన కళల్లో కులానికి, తెగకు ప్రత్యేకమైన రీతులున్నాయి. ఇవేవీ సమగ్రంగా నమోదు కాలేదు. మన సంస్కృతి ఇలా ఉందని కేవలం పుస్తకాలు రాస్తే కుదరదు. ఆనవాళ్లు, ఆధారాలు చూపాలి. ఘనమైన సంస్కృతి అని చెప్పుకోవడమే కాదు చూపించుకోవాలి. ఆద్యకళ ద్వారా చివరి తరం దగ్గరున్న ఆనవాళ్లలో ప్రతిదీ కాపాడుకోవాలని ప్రయత్నం చేశాం.
మనకోసం మన సిద్ధాంతం
పదేండ్ల క్రితం ఢిల్లీలో జరిగిన ఓ సదస్సులో డక్కలి వాళ్ల జాంబపురాణం గురించి మాట్లాడాను. ఉన్న పురాణాలు చాలు. కొత్తవి
అవసరం లేదన్నారు. అష్టాదశ (18) కులాలు, ప్రధానమైన నాలుగు కులాలు.. ఇక అంతే అన్నారు. వాళ్లు ఒప్పుకొంటే ఎంత. ఒప్పుకోకపోతే ఎంత? ఆ కులాలకు ఉప కులాలున్నాయి. వాళ్లకు పటాలున్నాయి. వాటిని చెప్పడానికో ప్రదర్శన కళ ఉంది. కథ ఉంది. ప్రత్యేకమైన కథన విధానం ఉంది. వాళ్లకే సొంతమైన వాయిద్యం ఉంది. అయినా దేనినీ గుర్తించరు. ఈ దేశాన్ని చూడాలంటే పలు సంస్కృతుల దృష్టితో చూడాలి. ఏ పాశ్చాత్య థియరీ మన సమాజానికి సరిపోదు. మన సిద్ధాంతాలు మనమే ప్రతిపాదించుకోవాలి. అలా ముందుకుపోతేనే మన కళలకు గుర్తింపు, దేశానికి గౌరవం. ఆత్మను, కళను ఏకం చేసేంత గొప్ప కళాకారులు అంతరించిపోతున్నారు. కిక్రీ కళాకారుడు సీతారాం చనిపోయాక అంత గొప్పగా వాయించేవాళ్లు లేరు. లింగోజీ పోయాడు. అంత హృద్యంగా ఆదివాసీ కిన్నెర పలికించే కళాకారుడు ఒక్కడుకూడా లేడిప్పుడు. పాడేకళ, వాయించే కళ కళాకారులతోపాటే మట్టిపాలు అవుతున్నది. వాళ్లతో మాట్లాడి, వాళ్ల జీవితాల్ని తెలుసుకుని, ఆ కళను అర్థం చేసుకుంటున్న సమయం లోనే.. చివరి తరం చిట్టచివరి కళాకారులు చనిపోతున్నారు.
పునరుజ్జీవం కోసం
వాయిద్యాల సేకరణను మా ఆద్యకళ బృందం మొదటి బాధ్యతగా తీసుకున్నది. కళ, కళాఖండం అవిభాజ్యం. వస్తువులు ఉంటే కళ ఉంటుంది. అందుకే వందల కళలకు సంబంధించిన వేలాది వాయిద్యాలు, చేతి వృత్తుల పనిముట్లు సేకరించాం. రాగ, తాళ సృజనలో సామాజిక పరిణామ క్రమాన్ని పోలిన సృజనాత్మక వైవిధ్యానికి వాయిద్యాలే సాక్ష్యాలు. మన సాంస్కృతిక చరిత్రను నిర్మించుకోవడానికి ఇవే ఆధారాలు. కాకతీయుల కాలంనాటి సమ్మక్క, సారక్కల గురించి కోయవాళ్ల డోలీ పటం కథలో ఉంది. ఆ కథ చెప్పే సకిని రామచంద్రయ్యను జయధీర్ తిరుమలరావు వెదికి పట్టుకున్నారు. ఆయనకు టీబీ ఉండేది. వైద్యం చేయించి, వ్యాధి తగ్గిన తర్వాత కోయ డోలీల మొత్తం కథనాన్ని డాక్యుమెంట్ చేశాం. పూర్తిగా ఎత్తిరాశాం. ఆ చరిత్ర ఎప్పటికీ నిలిచిపోయేలా ‘కోయ డోలీలు చెప్పిన వీరుల పోరుగద్దె- సమ్మక సారలమ్మ జాతర’ పేరుతో పుస్తకంగా తీసుకువచ్చాం. కోయ డోలీ కళాకారుడు సకిని రామచంద్రయ్యకు పద్మశ్రీ అవార్డు వచ్చింది. ఇది గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం. కోయలకు పటాలు ఉన్నట్లుగానే, గోండులకు జర్తాళీలు ఉన్నాయి. ఆద్యకళ వెలుగులోకి తెచ్చేనాటికి గోండులు జర్తాళీలను మరిచిపోయారు. ఇలా అన్ని కళలను, కథలను ఆద్యకళ గుర్తిస్తూ, కాపాడుతూ, గౌరవాన్ని కల్పించే ప్రయత్నం చేస్తున్నది. ఆద్యకళ కోసం ఫ్రాన్స్ వెళ్లాం. అక్కడ జరిగిన సమావేశాల్లో ఆదివాసీ, జానపద కళల గురించి విదేశీయులు శ్రద్ధగా విన్నారు. భారత దేశం గొప్పదని చెప్పుకోవడం కాదు ఆ గొప్పదనాన్ని చూపించుకోవడం మరచిపోవద్దు.