‘పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు’ తరహా నినాదాలు గోడలపై బాగానే ఉంటాయి.ఆచరణకు వచ్చేసరికి అన్నిటికీ చెట్లే అడ్డంకిగా కనిపిస్తాయి. ఇంటి నిర్మాణం మొదలుపెట్టడానికైనా, రోడ్డు వేయడానికైనా చెట్టు నరకాల్సిందే. గుడి, బడి, ఏం సంకల్పించినా వృక్షం కూలాల్సిందే. ఆ ముగ్గురు విద్యార్థినులు మాత్రం చెట్టంత మనసుతో చెట్లను పెంచే బాధ్యత భుజానికెత్తుకున్నారు. కత్తుల సిరిచందన, దేశపాక ప్రణతి, చల్లోజు దీక్షిత ముగ్గ్గురూ నల్లగొండలోని కేంద్రీయ విద్యాలయంలో సహ విద్యార్థులు. ఓ రోజు స్కూల్లో నిర్వహించిన ‘సేవ్ నేచర్… సేవ్ ట్రీస్’ కార్యక్రమం వాళ్ల మనసులో మొక్కలు పెంచాలనే ఆలోచనకు బీజాలు వేసింది.
Seed Balls | అయిదేళ్ల కిందటి మాట.. తొమ్మిదో తరగతి చదువుతున్న సిరిచందన, ప్రణతి, దీక్షిత మొక్కల పెంపకం చేపట్టారు. ‘నారు పోసినవాడు నీరు పోస్తాడు’ అన్నంత తేలికైన వ్యవహారం కాదది. ముగ్గురూ పాఠశాలకు వెళ్తూనే సెలవు రోజుల్లో చెట్లకు సమయం కేటాయించేవారు. ఖాళీ ప్రదేశాలు, గుట్టలను లక్ష్యం చేసుకుని.. సీడ్ బాల్స్ ద్వారా వీలైనన్ని ఎక్కువ మొక్కలు పెంచాలని సంకల్పించారు. ‘ఇల్లు కట్టాలని, రోడ్డు వేయాలని చెట్లను నరికేస్తున్నారు.
ఏ పనైనా చెట్టు నరకడంతోనే మొదలుపెడుతున్నారు. మా కష్టం రోడ్డు విస్తరణ పాలు కాకూడదనుకున్నాం. రోడ్డు పక్కన సీడ్ బాల్స్ వేయడం కంటే.. మనుషులకు దూరంగా గుట్టలపై విసరడమే మేలనుకున్నాం. ఆ విత్తనం మొలకెత్తి చెట్టుగా ఎదిగితే నరికేవారుండరు. ఎదిగిన చెట్లు కోతపడకుండా గుట్టను కాపాడుతాయని భావించాం’ అంటారు దేశపాక ప్రణతి. ‘ముందు కొండల మీద వనాలు పెంచాలని నిర్ణయించుకున్నాం. గుట్టలపై సీడ్ బాల్స్ వేస్తే కనుక, నాలుగు చినుకులు పడగానే ఇట్టే మొలిచేస్తాయి. అక్కడ పశువులు, జంతువుల సంచారం ఉండదు కాబట్టి, సురక్షితంగానూ ఉంటాయి కూడా’ అని చెబుతుంది సిరిచందన.
సీడ్ బాల్ కథ..
‘మా ముగ్గురికీ మా తమ్ముడు జశ్వంత్ తోడయ్యాడు. నలుగురం కలిసి సెలవు రోజుల్లో ఇంట్లో సీడ్ బాల్స్ తయారు చేసేవాళ్లం. ఎర్రమట్టిని నీళ్లతో కలిపి, ఆ తర్వాత పేడ జోడించి విత్తన బంతులు సిద్ధం చేసేవాళ్లం. వారం పది రోజులు ఆరబెట్టిన తర్వాత, బస్తాల్లో దాచేవాళ్లం. మార్కెట్లో విత్తనాలు కొనాలంటే చాలా డబ్బు చెల్లించాలి. దీంతో, ఇంట్లో పండ్లు తెచ్చినప్పుడు ఆ గింజలు జాగ్రత్తగా తీసి దాచుకునేవాళ్లం. వాటితోనే సీడ్ బాల్స్ చేసేవాళ్లం. మామిడి, చింత, నిమ్మ, రేగు, కర్జూర, ఈత, వేపతోపాటు ఆయా ఊళ్లల్లో పెరిగే వివిధ రకాల చెట్ల గింజలను సీడ్ బాల్స్ తయారీలో ఉపయోగించేవాళ్లం’ అని కథంతా వివరించింది దీక్షిత.
గుట్టలెక్కగలం..
సీడ్ బాల్స్ను బొత్తిగా జనసంచారం లేనిచోట విసరాలన్నది మా ప్రణాళిక. నల్లగొండ చుట్టు పక్కల ఎక్కడెక్కడ ఖాళీ ప్రదేశాలు, కొండలు ఉన్నాయో తెలుసుకుని.. గమ్యాన్ని చేరుకోడానికి పెద్దల సహకారం తీసుకునేవాళ్లం. వివాహాలు, శుభకార్యాలు, వేసవి యాత్రలు.. ఇలా మా ప్రయాణాల్లో కూడా సీడ్ బాల్స్ విసిరే పనిని ఓ భాగం చేసుకున్నాం. అలా ప్రతి సందర్భాన్నీ సద్వినియోగం చేసుకున్నాం. కొండలూ గుట్టల మీద పండ్ల చెట్లు తగ్గిపోవడం వల్ల అక్కడ ఆవాసం ఉండాల్సిన కోతులు ఊళ్ల మీదికి వస్తున్నాయి. పంటల్ని నాశనం చేస్తున్నాయి.
ఈ సమస్య పరిష్కారానికి చెట్లు పెంచడమే ఏకైక మార్గం. నల్లగొండ- సూర్యాపేట, హైదరాబాద్ -నల్లగొండ మార్గంలోని నెమలిబండ గుట్ట , బ్రహ్మంగారి గుట్ట, బండపాలెం గుట్ట (నకిరేకల్ – సూర్యాపేట మధ్య) తదితర ప్రాంతాల్లో ఎన్నో సీడ్ బాల్స్ వేశాం. గతంలో విచక్షణ లేకుండా.. చెట్లు నరికేసిన మైదానాల్లో కూడా విత్తన బంతులు వేస్తున్నాం. 2019 చివర్లో మా ప్రయాణం మొదలైంది.
2020 లాక్ డౌన్లో క్లాసులు లేకపోవడంతో, మరింత ఎక్కువ సమయం కేటాయించాం’ అని వివరిస్తారు ఆ విద్యార్థులు. పాఠశాల చదువు తర్వాత కూడా వీళ్లు పర్యావరణ ప్రయాణాన్ని విరమించలేదు. దీక్షిత విజయవాడలో చదువుతున్నది. సిరిచందన, ప్రణతి హైదరాబాద్లో ఉన్నారు. ఎక్కడున్నా సరే, సెలవుల్లో నల్లగొండ చేరుకుంటారు. ‘మేం చేసింది తక్కువే. కానీ సాధించాల్సింది చాలా ఉంది’ అంటున్నప్పుడు ముగ్గురి గొంతుకలోనూ నిజాయతీ. అదే వారిని హరిత ఉద్యమకారులను చేసింది.
బొకేలు వద్దు…సీడ్ బాల్సే ముద్దు!
సెలవు రోజుల్లో ఆటపాటలతో గడిపే పిల్లలకు భిన్నంగా సీడ్ బాల్స్ తయారు చేస్తున్న ఈ నలుగురూ.. సంతోషకరమైన సందర్భాల్ని కూడా పర్యావరణ వేడుకలుగా జరుపుకొంటున్నారు. పుట్టిన రోజున స్నేహితులకు సీడ్ బాల్స్ను గిప్ట్గా ఇస్తారు. మొక్కలు పంచుతారు. తమ దారిలో నడవమంటూ ఆత్మీయులను ప్రోత్సహిస్తారు. బొకేలు వద్దు, సీడ్ బాల్సే ముద్దంటూ పచ్చని నినాదాలు చేస్తారు.
…? నాగవర్ధన్ రాయల