నిన్న మొన్నటి వరకు మద్యం తయారీ రంగంలో మహిళల ఉనికి నామమాత్రం. కానీ కాలం మారుతున్నది. అడ్డు
గోడలు కూలుతున్నాయి. అందుకు సాక్ష్యం.. ఢిల్లీ మహిళ పూనమ్ ఛండేల్. ఈ రంగంలో తన ప్రయాణం ప్రముఖ డిస్టిల్లరీ కంపెనీ రాడికో ఖైతాన్తో మొదలైంది. ఓ ప్రఖ్యాత బ్రాండ్ కోసం ఆ సంస్థ ఉత్పత్తి చేసే విస్కీ మార్కెట్లో మంచి పేరు తెచ్చుకోవడంలో పూనమ్ పాత్ర కీలకమైంది. ఆ విజయంతో ప్రపంచం దృష్టిని ఆకర్షించారామె. లెక్క
లేనన్ని అవార్డులు గెలుచుకున్నారు. అది తన తొలి మెట్టు మాత్రమే. మరో డిస్టిల్లరీ.. షావాలెస్లో అడుగుపెట్టి,
కనుమరుగుకు సిద్ధంగా ఉన్న ఎనిమిది బ్రాండ్లకు ఊపిరి పోశారు.
‘మార్కెటర్ ఆఫ్ ది ఇయర్’గా నిలిచారు. తన హయాంలో పరిచయం చేసిన కోబ్రా బీర్ భారత్ ఉత్పాదక శక్తిని మరోసారి లోకానికి చాటింది. అయినా పూనమ్ సంతృప్తి చెందలేదు. న్యూ వరల్డ్ స్పిరిట్ మేనేజింగ్ డైరెక్టర్గా మరిన్ని విజయాల వైపు నడిచారు. ఒకవైపు ప్రీమియం బ్రాండ్లను లాభాల బాట పట్టిస్తూ.. మరోవైపు ధరలను గమనించుకుంటూ, నాణ్యతలో రాజీపడకుండా మార్కెట్ను ఆకట్టుకుంటున్నారు. పూనమ్ వృత్తి జీవితం ఎంత నిబద్ధతగా ఉంటుందో, వ్యక్తిగత జీవితమూ అంతే నిబ్బరంగా కనిపిస్తుంది. రోజూ పది కిలోమీటర్ల జాగింగ్, యోగా… ఆమెను దృఢంగా ఉంచుతున్నాయి. మరిన్ని విజయాలకు
మనసును, శరీరాన్నీ సన్నద్ధం చేస్తున్నాయి.