కొన్ని విజయాలను అవార్డులతో కొలవలేం. ప్రతిష్ఠాత్మక గ్లోబల్ పురస్కారం వరించకపోయినా కూడా.. శాంతి థెరిస్సా లక్రా గౌరవం మరింత పెరిగింది. ఆ నర్సమ్మ అండమాన్లోని ఒంగే జాతి గిరిజనులకు చేసిన సేవ సామాన్యమైంది కాదు. ఐదేండ్ల పాటు వాళ్ల మధ్యే బతికారు. వాళ్ల తిండే తిన్నారు. తను కూడా అండమాన్ వ్యక్తే. కానీ, పట్టణ ప్రాంతంలో పుట్టిపెరిగారు. ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా అక్కడికెళ్లారు. అప్పటి నుంచీ వాళ్లే ఆమె ప్రపంచం. సునామీ సమయంలో ఆ తెగకు రక్షణ కవచం అయ్యారు. అంటు వ్యాధుల నుంచి కాపాడారు. అంతేనా, అంతరించిపోతున్న ఆ జాతికి అమ్మలా అండగా నిలిచారు.
అప్పటికి ఆ తెగలో
డబ్భు ఎనిమిది మంది మాత్రం మిగిలారు. పోషక విలువల లోపాలు, శిశు మరణాలు ఒంగే తెగకు శాపంగా మారాయి. ఆ కష్టాల నుంచి వాళ్లను ఒడ్డున పడేశారు. ‘నా పిల్లలు మా అత్తయ్యను అమ్మా అంటారు. కానీ, వందలాది ఒంగే తెగ ప్రజలు మాత్రం నన్ను నోరారా లక్రా అమ్మా అని పిలుస్తారు’ అని సంతోషంగా
చెబుతారు శాంతి. ఉద్యోగ విరమణ తర్వాత కూడా ఆ బంధం తెగిపోలేదు. ఒంగే ప్రజల్ని ఆమె కలుస్తూనే ఉంటారు. కుశల ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు. విరమణ ఉద్యోగానికే. అనుబంధాలకు కాదు.