లక్షలాది సంవత్సరాలుగా మనం ఇలానే ఉన్నాం.. నిండా అసూయగ్రస్తులం, దురాశపరులం, దౌర్జన్యహితులం, అసహనపరులం, ఆదుర్దాలకు నిరాశలకు లోనయిన వాళ్లం. అప్పుడప్పుడు తళుక్కుమని సంతోషము, అనురాగము వెలుగుతూ ఉంటాయి. అసహ్యము, భయము, పెద్దమనిషి తరహా-ఇవన్నీ మనలో విచిత్రంగా కలిసిపోయి ఉన్నాయి. హింస, శాంతి- రెండూ మనలో మూర్తీభవించి ఉన్నాయి.
ఒంటెద్దు బండినుంచి జెట్ విమానస్థాయికి ప్రగతి సంపాదించాం బాహ్య ప్రపంచంలో. కాని, నసికంగా-ఆంతరికంగా-మనలో ఎలాంటి మార్పులేదు. ప్రపంచవ్యాప్తంగా అన్నిచోట్లా ఇలాంటి సాంఘిక వ్యవస్థను ‘వ్యక్తే’ రూపొందిస్తున్నాడు. మానవ సంబంధ బాంధవ్యాల ఆంతరిక ప్రాతిపదికపైననే బాహ్య సంఘ నిర్మాణం జరుగుతుంది. వ్యక్తి అనేవాడు అనుభవాల, ఆలోచనల, ప్రవర్తన తీరుల ఫలితంగానే రూపొందుతున్నాడు. మనలో ప్రతి ఒక్కరము గతాన్నంతా పోగుచేసుకుని ఉన్న పాతర, మానవాళి అంతా తనలో మూర్తీభవించినవాడు వ్యక్తి. మానవుడి చరిత్ర అంతా మనలోనే లిఖితమై, ముద్రితమై ఉంది.
అధికార లాలస, పదవీ వ్యామోహం, పరువు ప్రతిష్ఠల కోసం వెంపర్లాట, పేరు ప్రఖ్యాతుల కోసం వెతుకులాట.. ఇటువంటి కామనల సముదాయం అయిన పోటాపోటీల సంస్కృతిలో నివసిస్తున్న మీరు, మీలోను.. మీకు వెలుపల నిజంగా ఏం జరుగుతూ ఉన్నదో గమనిస్తున్నారా? మీరు గర్వంగా చెప్పుకొనే సాధన సంపత్తి, ప్రగతి; ప్రతి సంబంధంలోనూ పైకి తొంగి చూస్తున్న వైరుధ్యము, అసహనం, కిట్టనితనం, క్రౌర్యం, అంతులేని యుద్ధాలు, వీటన్నిటి మధ్య నివసిస్తున్నాం.
దీనిని యథాతథంగా అర్థం చేసుకోలేక దీనినుంచి భయంతో పారిపోవాలనుకుంటున్నాం. మనకు తెలియని వాటిని గురించి కూడా భయమే. మృత్యువు అంటే భయం, రేపు ఏం జరుగుతుందోనని భయం, అంటే మనకు తెలిసినవీ తెలియనివీ కూడా భయాన్నే కలిగిస్తున్నాయి. ఇదీ మన దైనందిన జీవితం. ఇది ఏ మాత్రం ఆశాజనకంగా లేదు. అందుచేత తత్వశాస్త్రం యొక్క అనేక రూపాలు, మత విశ్వాసాల తాలూకు విభిన్న రూపాలు… ఇవన్నీ యథార్థం నుంచి మనం పారిపోవడానికే దోహదం చేస్తున్నాయి.
ప్రసిద్ధ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి
‘గతం నుండి విముక్తి’ నుంచి