భద్రాద్రి జిల్లాలోని అటవీ ప్రాంతాన్ని మరింత విస్తరించేందుకు అటవీశాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. అంతరించిపోతున్న వృక్షజాతుల సంరక్షణకు వినూత్న పద్ధతికి శ్రీకారం చుట్టింది. బండారు, బట్టగణం, కలగోరు, ఏగిస, జిట్రేగి, తాని, కరక, నల్లమద్ది, నెమలినార, తెల్లమద్ది, ఇప్ప, మర్రి, రావి, జువ్వి, మేడి, వేస, నల్లబిందుగ, తెల్ల బిందు, బుడ్డదరిమి, తప్సి, చిలుకమద్ది, పూసుగు, మర్చి, పెండ్లిపాల, నల్లజీడి, సోమి, నారేప, నల్లపోనిక, తెల్లపోనిక వంటి అరుదైన వృక్షజాతుల విత్తనాలను సేకరించి వాటికి పునరుజ్జీవం కల్పించేలా అటవీశాఖ అడుగులు వేస్తున్నది. ఈ మేరకు అటవీ అధికారులు, సిబ్బంది విత్తనాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.
లక్ష్మీదేవిపల్లి, ఏప్రిల్ 18: అడవులు ఈ పుడమికి ఊపిరితిత్తుల్లాంటివి. పర్యావరణంలోని కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకుని జీవరాశులకు స్వచ్ఛమైన ఆక్సిజన్ అందించే సంపద ఇది. అడవుల విస్తరణ ఎంత పెరిగితే జీవుల మనుగడ అంతమేరకు పెరిగినట్లు లెక్క. అటవీప్రాంతంలో ఎన్నిరకాల వన్యప్రాణులు ఎంత పెద్దసంఖ్యలో ఉంటే ఆ ప్రాంతంలో జీవవైవిధ్యం అంత బాగున్నట్లు శాస్త్రీయ అంచనా. ఉదాహరణకు ఒక పులి జంట అడవంతా కలియదిరుగుతూ, ఆహారం కోసం వేటాడుతూ, వాటిని సంతతిని పెంచుకోవాలంటే వాటికి సుమారు 50 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం అవసరం. ఒకరోజులో వాటి విహారం అంత చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుందన్న మాట. అలా పులి జంట ఆ ప్రాంతంలో ఉందంటే మిగతా జీవరాశులు, వన్యప్రాణులు, వృక్షజాతులు సరిపడా అక్కడ ఉన్నట్లు ఒక శాస్త్రీయ అధ్యయనం. పులులు, సింహాల ఆవాసానికి ప్రస్తుతం మన భద్రాద్రి జిల్లా అడవులు ఎంతో అనుకూలమని పర్యావరణవేత్తలు వెల్లడిస్తున్నారు. అంత ప్రాధాన్యం ఉన్న అడవిని సంరక్షించుకోవడం ఎంతో ముఖ్యం కదా.. దీనిలో భాగంగా భద్రాద్రి జిల్లాలోని అటవీప్రాంతాన్ని మరింత విస్తరించేందుకు అటవీశాఖ పూనుకుంటున్నది. అందుకు వినూత్న పద్ధతిని ఎంచుకున్నది. దీనిలో భాగంగా ఔషధ మొక్కలు, కలపకు సంబంధించిన మొక్కలను నర్సరీల్లో పెంచుతున్నది. అలా పెరిగిన మొక్కలను ప్రణాళికాబద్ధంగా వాటిని అటవీప్రాంతాల్లో నాటుతున్నది. ప్రస్తుతం అటవీశాఖ సిబ్బంది, అధికారులు విత్తనాల సేకరణ పనిలో పడ్డారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే అనేక వృక్షజాతులు అంతరించిపోతున్నాయి. అలాంటి అరుదైన వృక్షజాతులను పరిరక్షించేందుకు అటవీశాఖ అడుగులు వేస్తున్నది. బండారు, బట్టగణం, కలగోరు, ఏగిస, జిట్రేగి, తాని, కరక, నల్లమద్ది, నెమలినార, తెల్లమద్ది, ఇప్ప, మర్రి, రావి, జువ్వి, మేడి, వేస, నల్లబిందుగ, తెల్ల బిందు, బుడ్డదరిమి, తప్సి, చిలుకమద్ది, పూసుగు, మర్చి, పెండ్లిపాల, నల్లజీడి, సోమి, నారేప, నల్లపోనిక, తెల్లపోనిక వంటి అరుదైన వృక్షజాతుల విత్తనాలను సేకరించి వాటికి పునరుజ్జీవనం కల్పించే దిశగా అటవీశాఖ అడుగులు వేస్తున్నది. అడవిలో విత్తనాల సేకరణకు వేసవి అనువైన సమయం. ప్రస్తుతం అటవీ అధికారులు, సిబ్బంది విత్తనాలను సేకరించే పనిలో పడ్డారు. సెక్షన్ అధికారులు, ప్లాంటేషన్ వాచర్లు, బేస్ క్యాంపు వాచర్లూ విత్తనాల సేకరణలో పాలుపంచుకుంటున్నారు.
సేకరించిన విత్తనాలను సిబ్బంది ప్రైమరీ బెడ్లలో మొలకెత్తిస్తారు. గింజలను చల్లడం గానీ వరుసల్లో పోయడం గానీ చేస్తారు. వాటిపై వర్మీ కంపోస్ట్ కలిపి పైన వరిగడ్డి పరుస్తారు. ఉదయం, సాయంత్రం తప్పనిసరిగా నీళ్లు పెడతారు. విత్తనాలు మొలకెత్తే వరకు వాటిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. బెడ్లపై వచ్చిన మొలకలను 15 రోజుల వరకు అలాగే ఉంచుతారు. ఆ తర్వాత 4.7 లేదా 5.7 సైజ్ పాలిథిన్ బ్యాగ్ల్లో మట్టిపోసి ఒక్కో మొలకను ఉంచుతారు. బ్యాగుల్లో మొక్క బాగా ఎదిగిన తర్వాత 6.12 లేదా 9.11 సైజ్ బ్యాగ్ల్లోకి మార్చి ఏపుగా పెరిగే వరకు ఉంచుతారు. అనంతరం అటవీప్రాంతంలో వాటిని ఎక్కడెక్కడ నాటాలో ప్రణాళిక సిద్ధం చేసుకుని నాటుతారు. ఇలా ఒక మొక్క నాటడానికి రెండు సంవత్సరాల ముందు నుంచే ప్రణాళికలు అమలవుతాయి.
అటవీశాఖ సిబ్బంది అడవిలో సేకరించిన విత్తనాలను నర్సరీలకు అప్పగిస్తారు. నర్సరీల ఇన్చార్జ్జులు ముందు సీడ్ ట్రిట్మెంట్ చేస్తారు. విత్తనాల ప్రాసెసింగ్లో భాగంగా తొలుత నాసిరకమైన విత్తనాలను తొలగిస్తారు. కాయలు పగులగొట్టి గింజలను వేరు చేస్తారు. వాటిలో తేమ లేకుండాఆరబెడతారు. పొడి వాతావరణంలో నిల్వ చేస్తారు. విత్తనాలు మొలకెత్తాలంటే దానిలో పిండం పూర్తిగా అభివృద్ధి చెందిన దశలో ఉండాలి. అవి మొలకెత్తడానికి అవసరమైన గాలి, నీరు, ఉష్ణోగ్రతలు సమంగా అందేలా ఏర్పాట్లు చేస్తారు. విత్తనాలపై పైపొరను పలుచబరిచేందుకు రకరకాల ప్రాసెసింగ్ చేస్తారు. విత్తనాలను 24 గంటల పాటు నీటిలోనానబెట్టి తర్వాత 24 గంటలు ఎండలో ఆరబెడతారు. ఎండిన తర్వాత వాటిని నేలపై రాకిస్తారు. కర్రలతో కొట్టి రసాయనాలతో శుద్ధి చేస్తారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అడవులతో పోలిస్తే భద్రాద్రి జిల్లా అటవీ ప్రాంతంలో అరుదైన వృక్షజాతులు ఉన్నాయి. అవి అంతరించిపోకుండా ఉండేందుకు, వాటిని సంరక్షించుకునేందుకు అడవిలో విత్తనాలు సేకరిస్తున్నాం. రీసైక్లింగ్ పద్ధతిలో మొక్కలను నర్సరీలో పెంచుతున్నాం. తర్వాత అటవీప్రాంతంలో అవసరమైన చోట నాటుతున్నాం. ఇప్పటికే సిబ్బంది అనేక రకాల విత్తనాలను సేకరించారు.
– అప్పయ్య, ఎఫ్డీవో, కొత్తగూడెం