Vemulawada | వేములవాడ, సెప్టెంబర్ 13 : వేములవాడ భీమేశ్వర సదన్ అద్దె గది ఇచ్చిన తర్వాత భక్తుడి ఫిర్యాదుపై స్పందించని అధికారులు, సిబ్బందికి రాజన్న ఆలయ ఈవో రమాదేవి నలుగురికి సంజాయిషీ నోటీసులు జారీ చేశారు. ఈనెల 6న హైదరాబాద్ కు చెందిన కపిల్ దంపతులు వేములవాడకు చేరుకొని భీమేశ్వర సదన్ లోని 48, 49 నంబర్లకు చెందిన రెండు అద్దె ఏసీ గదులను అద్దెకు తీసుకున్నారు. ఇందులో 49లో ఏసీ పనిచేయడం లేదని సంబంధిత సిబ్బందికి సమాచారమిచ్చారు. మరో 48వ గదిలోనైనా సేదతీరుదాము అనుకుంటే అందులోనూ ఏసీ పనిచేయడం లేదని చెప్పినప్పటికీ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరుపై సదర్ భక్తుడు ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా నేను తాళం చెవులు ఇవ్వడం లేదంటూ అక్కడ ఉన్న సిబ్బందికి చెప్పి మరి తీసుకెళ్లిన తీరు విమర్శలకు దారితీసింది.
దీంతో ఈవో రమాదేవి ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా సంబంధిత అధికారులు ఏఈవో, పర్యవేక్షకులు, ఇన్స్పెక్టర్, విధుల్లో ఉన్న సిబ్బందికి సంజాయిషీ నోటీస్ జారీ చేశారు. జరిగిన సంఘటనపై సమాధానం ఇవ్వాలని సదరు ఉద్యోగులకు నోటీసులు జారీ చేశారు. ఇదిలా ఉండగా స్వామివారి ప్రసాదాన్ని తయారు చేసే క్రమంలో ఇద్దరు పరిచారకుల మధ్య జరిగిన గొడవను కూడా తీవ్రంగా పరిగణించినట్లు తెలిసింది. అయితే స్వామివారి ప్రసాదాన్ని తయారు చేసే క్రమంలో నెయ్యి మరొక పరిచారకుడిపై పడడంతో అతను తీవ్ర ఆగ్రాహావేశాలకు లోనై అసభ్యకరమైన పదజాలంతో మరో పరిచారకుని దూషించినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో తీవ్రంగా పరిగణించిన ఈవో రమాదేవి ఒకరికి సంజాయిషీ నోటీస్ జారీ చేశారు.