హుజూరాబాద్ రూరల్/ ఇల్లందకుంట, జనవరి 28: రైతులు యాసంగి వరి పంటలను చీడపీడల నుంచి కాపాడుకునేందుకు సస్యరక్షణ చర్యలు పాటించాలని జిల్లా ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు సూచించారు. శనివారం హుజూరాబాద్ మండలం జూపాక, బొత్తలపల్లి, ఇల్లందకుంట మండలం శ్రీరాములపల్లి గ్రామాల్లో జిల్లా వ్యవసాయ పరిశోధనా స్థానం, జిల్లా ఏరువాక కేంద్రం, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పంటల క్షేత్ర సందర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్త్రవేత్తలు డాక్టర్ విజయభాసర్, డాక్టర్ మధుకర్ రావు, డాక్టర్ రాజేంద్రప్రసాద్ రైతుల పంట పొలాలను పరిశీలించారు.
వరి పంటకు మొగి పురుగు, అగ్గి తెగులు సోకినట్లు గుర్తించారు. మొగి పురుగు ఆశించిన వరి పైరు పిలక దశలో ఎండి పోతుందని తెలిపారు. ముదురు నారు నాటడం, రాత్రి పూట తక్కువ ఉష్ణోగ్రతల నమోదు, రోజుకు 7 గంటల కంటే ఎకువ సూర్యరశ్మి కారణంగా వరి పంటలో ఈ పురుగు ఆశిస్తుందని వివరించారు. మొగి పురుగు నివారణకు నాట్లు వేసిన తర్వాత 10 నుంచి 15 రోజుల్లో ఎకరానికి కార్బోప్యురాన్ 3జీ గుళికలు 10 కిలోలు లేదా కార్టప్ హైడ్రో క్లోరైడ్ 4జీ గుళికలు 8 కిలోలు లేదా క్లోరాత్రనిలిప్రోల్ 0.4 జీ గుళికలు నాలుగు కిలోల చొప్పున చల్లుకోవాలని సూచించారు. ఒకవేళ పురుగు ఉధృతి ఎకువగా ఉంటే కార్టప్ హైడ్రో క్లోరైడ్ 50ఎస్పీ 400 గ్రాములు నీటిలో కలిపి పిచికారీ చేయాలన్నారు. ఆయా చోట్ల క్షేత్ర సందర్శనలో హుజూరాబాద్ మండల వ్యవసాయ అధికారి సునీల్, వ్యవసాయ విస్తరణాధికారులు నరేశ్, అచ్యుత్, ఇల్లందకుంట పీఏసీఎస్ వైస్ చైర్మన్ కందల కొమురెల్లి, ఉప సర్పంచ్ రవి కుమార్, ఏవో గుర్రం రజిత, ఏఈవోలు తిరుపతి, రాకేశ్తో పాటు రైతులు గుడికందుల రాజయ్య, వీరన్న పాల్గొన్నారు.