మిగతా పర్వదినాల మాదిరిగానే మహాశివరాత్రిని కూడా హిందువులు ఘనంగా జరుపుకుంటారు. అర్ధరాత్రి జరిగే లింగోద్భవ కాలాన్ని మహాశివరాత్రిగా భావించి పూజలు చేస్తూ జాగరణ పాటిస్తారు. జాగారం చేయాలంటే పొట్ట ఖాళీగా ఉండాలి. అలా లేనిపక్షంలో నిద్ర ముంచుకొస్తుంది. అందుకని జాగారం చేసేటప్పుడు ఉపవాసం కూడా పాటిస్తుంటారు. ఉపవాసం చేయడంతో శారీరక శుద్ధి కలుగుతుందని వైద్యులు చెప్తుంటారు. ఉపవాసం అంటే దేవుడికి మన మనస్సును దగ్గరగా ఉంచడం అని పండితులు అంటుంటారు.
మహాశివరాత్రి జాగారం పూర్తిచేసిన తర్వాత ఆహారం వండుకుని భోజనం చేసి ఉపవాసం విడువడం మన తెలుగు వారి ఆచారం. అయితే, కొందరు పచ్చి మంచినీరు కూడా ముట్టుకోకుండా ఉపవాస దీక్ష చేస్తుండగా.. మరికొందరు పండ్లు, పలహారాలు తీసుకుంటూ ఉంటారు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఆరోగ్యంపై దృష్టిపెడుతూనే ఆచారాలు పాటించడం మంచిదని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఈ సమయంలో ఎలాంటి పండ్లు, పలహారాలు తీసుకొంటే ఆరోగ్యానికి మంచిది అనేది చాలా మందిని వేధిస్తున్న ప్రశ్న. పండు రూపంలో సాబుదానా ఖిచ్డితో పాటు ఇతర ఎంపికలు కూడా అందుబాటులో ఉన్నాయి. బంగాళాదుంప, గుమ్మడికాయ దోస లేదా క్యారెట్-టమోటా సూప్ తయారు చేసుకుని తీసుకోవచ్చు. తీపి తినాలనుకుంటే చల్లని లేదా పండ్ల రసాలతో కలిపిన పెరుగును సిద్ధం చేసుకోవచ్చు. వెజ్ కట్లెట్స్ వంటి వాటిని కూడా తక్కువ సమయంలో సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇవి ఉపవాసంలో ఉన్నవారికి శక్తి ఇవ్వడమే కాకుండా ఆరోగ్యపరంగా కూడా మంచిదంటున్నారు నిపుణులు.
ఆలూ, గుమ్మడికాయ దోస
ఆలూ, గుమ్మడికాయలతో తయారుచేసిన దోసలను తినడం చాలా మంచిది. గుమ్మడికాయలో విటమిన్ సీ పుష్కలంగా ఉండి మనకు తక్షణ శక్తిని అందజేస్తాయి. అదేవిధంగా ఆలుగడ్డలో కూడా పోషకాలు ఎన్నో ఉంటాయి. ఉపవాసం ఉన్నవారు కడుపు సమస్యలు రాకుండా ఉండేందుకు ఆలుగడ్డలు సహకరిస్తాయి. వీటితో చాలా తక్కువ సమయంలో దోసలను చేసుకుని తినడం ద్వారా తక్షణ శక్తిని పొందడంతోపాటు పొట్ట సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు.
టమాట, గాజర్ సూప్
టమాటలుగానీ, గాజర్ గానీ తీసుకుని మెత్తగా ఉడికించుకుని వడగట్టాలి. దాని రసంలో మిరియాల పొడి వేసి మరోసారి వేడి చేసి వడ్డించాలి. వేడివేడి టమాట, గాజర్ సూప్ తీసుకోవడం వల్ల శరీరానికి లైకోపిన్తోపాటు ఫైబర్ అందుతుంది. ఈ సూప్ మన ఎనర్జీ లెవల్స్ ఒకే మాదిరిగా ఉండేందుకు సహకరిస్తుంది.
ఫ్రూట్ యోగర్ట్
రకరకాల పండ్లను తీసుకుని చిన్నచిన్న ముక్కలుగా కోసుకుని వాటికి తీయని పెరుగును కలపాలి. దీనిలో బెల్లంగానీ, ఖర్జూరాల రసంగానీ, తేనెగానీ వేసుకుని తినడం వల్ల మరింత శక్తి అందుతుంది. ఫ్రూట్ యోగర్ట్లో ముఖ్యంగా పైనాపిల్, అంగూర్, ఆరెంజ్, అరటిపండు ముక్కలు వేసుకుంటే మరింత టేస్టీగా ఉంటుంది. ఫ్రూట్ యోగర్ట్ తినడం వలన ఫైబర్స్ శరీరానికి అందుతాయి. ఆహారం తీసుకోకపోవడం వల్ల వచ్చే బలహీనతను దూరం చేస్తుంది.
పెరుగు పానీయం
కప్పు పెరుగుతో చల్లటి పానీయం తయారుచేసుకుని తీసుకుంటే చాలా మంచిది. ఈ పానీయంలో బాదాం, కాజు, పిస్తా, ఖర్బూజా గింజలు, గసగసాలను పేస్ట్గా చేసి పెరుగులో వేసి బాగా నాననివ్వాలి. అనంతరం పైన కేసర్, కొంచెం నల్ల మిరియాల పొడి, ఏలకుల పొడిని వేసుకుని తీసుకోవాలి. ఈ పానీయంను తీసుకోవడం ద్వారా శరీరానికి కావాల్సిన కాల్షియంతోపాటు ప్రొటీన్లు సమృద్ధిగా అంది తక్షణ శక్తి వస్తుంది. దీనిలో బెల్లంగానీ, తేనెగానీ కలపడం వల్ల అది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచి మనల్ని ఉత్సాహవంతులుగా చేస్తుంది.
వెజ్ కట్లెట్
ఆలుగడ్డలు, క్యారెట్లను ముద్దగా చేసుకుని వెజ్ కట్లెట్ చేసుకుని తినడం చాలా మంచిది. క్యారెట్, బంగాళాదుంపలో ఫైబర్లు అధికంగా ఉంటాయి. ఇది తక్కువ పరిమాణంలో తిన్నా ఎక్కువసేపు ఆకలి ఉండదు. వీటిని తినడం వల్ల శరీరం బరువు పెరుగకుండా కూడా చూసుకోవచ్చు.