దుబాయ్, జూలై 19: పశ్చిమాసియాలో 8వ రోజు కూడా దాడులు కొనసాగాయి. జోర్డాన్లో అమెరికా దళాలపై శనివారం ఇరాన్ చేసిన దాడికి ప్రతీకారంగా ఇరాన్ లక్ష్యాలపై విరుచుకుపడినట్టు యూఎస్ మిలిటరీ ఆదివారం ప్రకటించింది. ఈ మేరకు యూఎస్ సెంట్రల్ కమాండ్ ఒక ప్రకటన చేస్తూ ఇరాన్ సైనిక కోస్తా నిఘా, వాయు రక్షణ వ్యవస్థలు, క్షిపణి, డ్రోన్ నిల్వ కేంద్రాలపై దాడులు చేసినట్టు తెలిపింది. ఈ దాడిని ఇరాన్ అటామిక్ ఎనర్జీ ఆర్గనైజేషన్ ఖండించింది. ఇది అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని ఆరోపించింది. ఈ దాడిపై అంతర్జాతీయ అణు శక్తి సంస్థ (ఐఏఈఏ) స్పందించింది. తమ సంస్థ సభ్యులు గతంలో ఆ కేంద్రాన్ని సందర్శించినప్పుడు, అది నిర్మాణ దశలో ఉందని అందులో ఎలాంటి అణు పదార్థాలు లేవని తెలిపింది.
ఇరాన్ నిర్ణయాన్ని ఏ మాత్రం పట్టించుకోను: ట్రంప్
అమెరికా-ఇరాన్ అవగాహన ఒప్పందం (ఎంవోయూ)ను పాటించడం మానేయాలన్న ఇరాన్ నిర్ణయాన్ని తానే మాత్రం పట్టించుకోనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇరు దేశాల మధ్య ఫిబ్రవరి 28న ప్రారంభించిన యుద్ధాన్ని నిలిపివేయాలని రెండు దేశాలు గత నెలలో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. వచ్చే 60 రోజుల్లో తుది ఒప్పందం కుదుర్చుకోవడానికి అంగీకరించాయి. అయితే దానిని ఉల్లంఘించి ఇరు దేశాల పరస్పర దాడులతో ఆ ఎంవోయూకి తూట్లు పడింది.