Urkaine : రష్యా-ఉక్రెయిన్ (Russia-Ukraine) యుద్ధం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) తీసుకున్న నిర్ణయం ఒక గేమ్ ఛేంజర్ అని ఉక్రెయిన్ వ్యాఖ్యానించింది. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో జో బైడెన్ తీసుకున్న నిర్ణయం యుద్ధంలో ‘గేమ్ఛేంజర్’ గా మారే అవకాశం ఉందని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సైబిగా (Andriy Sybiga) చెప్పారు.
రష్యాపై దాడికి అమెరికా తయారుచేసిన దీర్ఘశ్రేణి క్షిపణులను తాము ప్రయోగిస్తే యుద్ధభూమిలో చాలా మార్పులు వస్తాయని, రష్యా భూభాగంలోని సైనిక స్థావరాలపై దాడిచేసే హక్కు కీవ్కు ఉందని ఆండ్రీ సైబిగా వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ ఎంత ఎక్కువగా దాడిచేస్తే ఇరుదేశాల మధ్య యుద్ధం అంత వేగంగా ముగుస్తుందని ఆండ్రీ అభిప్రాయం వ్యక్తంచేశారు.
కాగా, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మంగళవారంతో 1000వ రోజుకు చేరుకున్న నేపథ్యంలో నిర్వహించిన యూఎన్ (UN) భద్రతా మండలి (Security council) సమావేశానికి ముందు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధగతిని మార్చేలా అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ఓ నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్కు తాము అందిస్తున్న దీర్ఘశ్రేణి క్షిపణులను రష్యా భూభాగంపై దాడికి వినియోగించుకునేందుకు అనుమతిస్తున్నట్లు ప్రకటించారు.
దాంతో రష్యాపైకి దీర్ఘశ్రేణి క్షిపణులను ఉపయోగించుకోవడానికి ఉక్రెయిన్కు అవకాశం దక్కుతుంది. రష్యాపైకి దీర్ఘశ్రేణి క్షిపణులను ప్రయోగించడానికి అనుమతి ఇవ్వాలని ఉక్రెయిన్ ఇప్పటికే పలుమార్లు మిత్ర దేశాలను కోరిందని, ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన నిర్ణయాలతో ఈ ఉద్రిక్తతలకు ఆజ్యం పోస్తున్నారని మాస్కో తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. దీనికి అమెరికా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.
బైడెన్ కార్యవర్గం ప్రమాదకర నిర్ణయం తీసుకుందని రష్యా డ్యూమా సభ్యురాలు మారియా బూటినా విమర్శించారు. మూడో ప్రపంచయుద్ధం వైపు నెట్టడానికి ప్రయత్నిస్తున్నారా అని ప్రశ్నించారు. యూఎన్ (UN) రాజకీయ వ్యవహారాల అండర్ సెక్రటరీ-జనరల్ రోజ్మేరీ డికార్లో మాట్లాడుతూ రష్యా-ఉక్రెయిన్ల మధ్య యుద్ధం నేపథ్యంలో ఇతర దేశాలు జోక్యం చేసుకోకుండా ఉండాలని సూచించారు.