Afghanistan : తాలిబాన్లు అధికారంలోకి వచ్చాక అఫ్గాన్స్థాన్లోని ప్రజలు భావ ప్రకటన స్వేచ్ఛను కోల్పోయారు. ఇప్పటికే పత్రికలపై, న్యూస్ ఛానెళ్లపై ఆంక్షలు విధించిన తాలిబాన్లు తాజాగా అమెరికా రేడియో సంస్థలపై నిషేధం విధించారు. వాయిస్ ఆఫ్ అమెరికా (వీఓఏ), రేడియో ఫ్రీ యూరప్ (రేడియో లిబర్టీ) రేడియో ఛానెళ్లను బ్యాన్ చేశారు. ఈ రెండు మీడియా సంస్థలకు అమెరికా ఫండింగ్ చేస్తోంది.
‘ఏ నెట్వర్క్ అయినా అఫ్గానిస్థాన్లోని మీడియా చట్టాలకు లోబడి పనిచేయాలి. తరచూ ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా పనిచేసే సంస్థలకు ఇక్కడ చోటు లేదు. వృత్తిపరమైన నిబద్ధత చూపడంలో ఈ రెండు రేడియో ఛానెళ్లు విఫలమయ్యాయి. అందుకనే అవి మూతపడనున్నాయి’ అని అఫ్గాన్ విదేశీ వ్యవహారాల ప్రతినిధి అబ్దుల్ ఖహర్ బల్కి ఒక ప్రకటనలో వెల్లడించాడు.
ఈ రెండు రేడియో ఛానెళ్లలో ప్రసారమయ్యే కంటెంట్ మీద ఫిర్యాదులు రావడంతో తాలిబాన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అఫ్గానిస్థాన్లో 2021 ఆగష్టులో తాలిబాన్ల రాజ్యం ఏర్పడ్డాక దాదాపు 40 శాతం మీడియా సంస్థలు మూతపడ్డాయి. 60 శాతం మంది జర్నలిస్టులు తమ వృత్తిని విడిచిపెట్టారు.