లండన్, మే 27: ఉష్ణమండల ప్రాంతాల్లో కనిపించే పెను తుఫానుల్లో అత్యంత తీవ్రత కలిగే సూపర్ సైక్లోన్ల వల్ల రానున్న కాలంలో భారత్లో విధ్వంసకర పరిస్థితులు తలెత్తవచ్చని యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. వాతావరణ మార్పులే దీనికి ప్రధాన కారణమని తెలిపారు.
2020లో విరుచుకుపడ్డ ‘అంఫన్’ సూపర్ సైక్లోన్ తీవ్రత పెరుగడానికి గ్లోబల్ వార్మింగ్ ఒక కారణమని పరిశోధకులు వెల్లడించడం తెలిసిందే. అప్పటి డాటాను విశ్లేషించిన శాస్త్రవేత్తలు తాజాగా ఈ అంచనాకు వచ్చారు. గ్రీన్హౌస్ గ్యాస్ ఉద్గారాల మోతాదు ఇలాగే కొనసాగితే, ‘అంఫన్’ సృష్టించిన బీభత్సం కంటే 250 శాతం ఎక్కువ తీవ్రతతో భారత ప్రజలు ప్రభావితం కావొచ్చని హెచ్చరించారు. ఒక మీటరు కంటే ఎక్కువ స్థాయిలో వరదలు విరుచుకుపడవచ్చని తెలిపారు.