ఇస్లామాబాద్: పాకిస్థాన్లో సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్పై దుండగులు దాడి చేశారు. సీనియర్ జర్నలిస్ట్ అయాజ్ అమీర్ (Ayaz Amir) శుక్రవారం రాత్రి లాహోర్లోని దునియా న్యూస్ చానల్లో ఓ ప్రోగ్రామ్లో పాల్గొన్నారు. అదిముగిసిన అనంతరం తన ఇంటికి వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆయన కారును అడ్డగించిన గుర్తు తెలియని వ్యక్తులు.. దాడికి పాల్పడ్డారు. ఆర్మీ అధికారులను ప్రాపర్టీ డీలర్లుగా పేర్కొన్నందుకుగాను తనపై దాడికి పాల్పడినట్లు ఆయన చెప్పారు.
గురువారం ఇస్లామాబాద్లో జరిగిన ఓ సెమినార్లో పాల్గొన్న అయాజ్ అమీర్.. దేశంలోనే అత్యంత శక్తివంతమైన ఆర్మీ జనరల్లను విమర్శించారు. వారిని ప్రాపర్టీ డీలర్లుగా పేర్కొన్నారు. మహ్మద్ అలీ జిన్నా, అల్లామా ఇక్బాల్ ఫొటోలను తొలగించి ఈ ప్రాపర్టీ డీలర్ల ఫొటోలను పెట్టాలన్నారు. ఈ వ్యాఖ్యలు చేసినందుకే తనపై దాడి జరిగినట్లు ఇక్బాల్ చెప్పారు. తనను కొట్టడమే కాకుండా తన దుస్తులు చించివేశారని, సెల్ఫోన్, పర్సు ఎత్తుకెళ్లారని, జనాలు గుమిగూడటంతో వారు అక్కడినుంచి వెళ్లిపోయారని తెలిపారు.