కీవ్: ఉక్రెయిన్ రాజధాని కీవ్లోకి రష్యా సైనిక దళాలు చొచ్చుకొస్తున్న తరుణంలో ఆ దేశ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ మరోసారి చర్చల ప్రతిపాదన చేశారు. మరణాలను ఆపుదామని కోరారు. ‘రష్యా అధ్యక్షుడితో మాట్లాడాలని నేను మరోసారి భావిస్తున్నాను. ఉక్రెయిన్ అంతటా పోరాటాలు జరుగుతున్నాయి. ప్రజల మరణాలను ఆపడానికి కూర్చొని చర్చించుకుందాం’ అని తాజా ప్రకటనలో పేర్కొన్నారు. రష్యా దాడికి ముందు కూడా పుతిన్తో చర్చలకు సిద్ధమేనని జెలెన్స్కీ తెలిపారు. అయితే పుతిన్తో మాట్లాడేందుకు తాను ప్రయత్నించినా అటు నుంచి ఎలాంటి సమాధానం రాలేదని ఆరోపించారు.
మరోవైపు ఉక్రెయిన్తో చర్చల కోసం బెలారస్ రాజధానికి ప్రతినిధి బృందాన్ని పంపడానికి సిద్ధమేనని రష్యా తెలిపింది. ఇలాంటి శిఖరాగ్ర సమావేశం ఏర్పాటుకు బెలారసియన్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో కూడా సమ్మతించారని రష్యా ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ తెలిపారు. బెలారసియన్ రాజధాని మిన్స్క్లో ఉక్రేనియన్ ప్రతినిధి బృందంతో చర్చల కోసం ఉన్నత స్థాయి ప్రతినిధి బృందాన్ని పంపడానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ సిద్ధంగా ఉన్నారని చెప్పారు. గతంలో కూడా ఉక్రెయిన్ సంక్షోభంపై శాంతి చర్చలకు బెలారసియన్ రాజధాని వేదికైంది.
మరోవైపు వెయ్యి మందికిపైగా రష్యా సైనికులను తమ ఆర్మీ మట్టుబెట్టిందని ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. రష్యాకు ఇప్పటి వరకు ఇదే పెద్ద ఎదురుదెబ్బ అని పేర్కొంది.