లండన్ : బ్రిటన్కు చెందిన 32 ఏళ్ల జాన్ ఆష్బీ.. 2025లో ఓ మహిళను రేప్ చేశాడు. అయితే ఆమె ముస్లిం మతానికి చెందిన వ్యక్తి అనుకుని .. సిక్కు మహిళను అతను అత్యాచారం చేశాడు. నిందితుడు ఈ విషయాన్ని కోర్టులో చెప్పాడు. ప్రస్తుతం బర్మింగ్హామ్ క్రౌన్ కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. ఆ కేసులో శుక్రవారం అతనికి శిక్షను ఖరారు చేయనున్నారు. అత్యాచారం చేసే క్రమంలో మహిళను బూతులు తిట్టాడు. ముస్లిం అనుకుని ఆమెను వేధించినట్లు అంగీకరించాడు. 2025 అక్టోబర్లో వాల్సాల్ ఏరియాలో దాడి ఘటన జరిగింది. అత్యాచారం, దొంగతనం, బెదిరింపులు, దాడికి పాల్పడినట్లు అతను ఒప్పుకున్నాడు.
దాడి జరగడానికి ముందు బాధిత అమ్మాయికి, నిందితుడికి ఎటువంటి పరిచయం లేదని కోర్టు తేల్చింది. పనిప్రదేశం నుంచి బస్సు దిగి ఇంటికి వెళ్తున్న సమయంలో జాన్ ఆష్బీ ఆమెను వెంబడించాడు. ఓ కర్రతో అతను ఇంట్లోకి ప్రవేశించాడు. ఇంట్లో శబ్ధం రావడంతో ఆ అమ్మాయి బాత్రూం డోర్ వేసుకున్నది. కానీ నిందితుడు జాన్ గట్టిగా ఆ డోర్ను నెట్టేసి లోపలికి ప్రవేశించాడు. రూమ్లో లైట్లు ఆర్పేసి.. తాను కేవలం సరదా కోసం ఇక్కడకు వచ్చినట్లు చెప్పాడు.
ఆ తర్వాత కర్రతో ఆమెను కొట్టాడు. గొంతు నలిమాడు. బాత్టబ్లోకి నెట్టేశాడు. హాట్వాటర్ను ఆన్ చేశాడు. ఆ సమయంలో ఇస్లామోఫోబిక్ మాటలతో ఆ మహిళను తిట్టాడు. ముస్లిం అనుకుని ఆమెను తీవ్రంగా దుర్భాషలాడాడు. కానీ ఆమె సిక్కు మతస్థురాలని అతనికి తెలియదు. నగలు, మొబైల్ తీసుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. కొన్ని క్షణాల్లోనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. రెండు రోజుల వ్యవధిలో బర్మింగ్హామ్లోని పెర్రీ బార్ ఏరియాలో నిందితుడిని అరెస్టు చేశారు.