దోహా: ఒక దేశాధినేత మరో దేశంలో పర్యటిస్తున్నాడంతే హంగూ అర్భాటాలు మామూలుగా ఉండవు.. ఆయన కోసం విమానాశ్రయంలో ఎదురుచూసే అధికారులు.. రెడ్ కార్పేట్తో స్వాగతం.. సైనిక వందనం, ఇరు దేశాల అధికారుల హాడావిడి అంతాఇంతా కాదు.. ఒక్కోసారి ఆయనకు గ్రాండ్గా వెల్కం చెప్పేందుకు పర్యాటక దేశ ప్రధానితోపాటు మంత్రులు విమానంకోసం వేచిచూస్తూ ఉంటుంటారు. అయితే ఇక్కడ అలా జరుగలేదు. స్వాగతం పలికేందుకు రెడ్ కార్పేట్ ఉంది, ఎంబసీ అధికారులు రెడీ అయ్యారు.. గౌరవ వందనం సమర్పించేందుకు సైనికులు తుపాకులతో సిద్ధంగా ఉన్నారు. అయినా ఆ అతిథి విమానంలోనుంచి దిగలేదు. అరగంటపాటు అందులోనే వేచిఉన్నారు. ఎందుకంటే..
జర్మనీ అధ్యక్షుడు ఫ్రాంక్ వాల్టర్ స్టెయిన్మీర్ (Frank-Walter Steinmeier) ఖతార్లో (Qatar) పర్యటించారు. ఆయన విమానం దోహాలో (Doha) దిగింది. జర్మన్ ఎంబసీ అధికారులు, సైనికులు ఆయనకు స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. అయితే ఖతార్ మంత్రులు సమయానికి అక్కడి చేరుకోలేకపోయారు. దీంతో ఆయన విమానం దిగలేదు. వారికోసం మెట్ల వద్ద చేతులుకట్టుకుని అరగంటపాటు వేచిచూశారు. ఎట్టకేలకు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుల్తాన్ అల్ మురైచాయ్ (Sultan al-Muraichai) ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. అప్పుడుగాని జర్మనీ అధ్యక్షుడు విమానం దిగిరాలేదు.
అనంతరం ఆయన ఖతార్ రాజు షేఖ్ తమిమ్ ఇన్ అహ్మద్ అల్ థానీతో సమావేశమయ్యారు. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల గురించి చర్చించుకున్నారు. అనంతరం ఆయన స్వదేశానికి పయణమయ్యారు. అలా ఆయన పర్యటన మూడుగంటల్లోనే ముగిసిపోయింది.