ఖాట్మాండు: నేపాల్లో వాయు కాలుష్యం పెరిగింది. దీంతో విద్యా సంస్థలను మూసివేస్తున్నట్లు నేపాల్ ప్రభుత్వం పేర్కొన్నది. ఏప్రిల్ రెండవ తేదీ వరకు విద్యాసంస్థలను మూసివస్తున్నట్లు విద్యా మంత్రిత్వశాఖ ప్రకటించింది. గత కొన్ని రోజుల నుంచి ఖాట్మాండు లోయలో కాలుష్యం విపరీతంగా పెరిగింది. లోయ ప్రాంతంలో అడవులు అంటుకోవడం వల్ల సమీప నగరంలో ఆ పొగ కమ్ముకుంటోంది. విషపూరితమైన వాయువు ఆకాశమంతా నిండిపోవడంతో.. ప్రజలు శ్వాస పీల్చుకునేందుకు ఇబ్బందిపడుతున్నారు. చాలా మందికి కంటి సమస్యలు కూడా ఉత్పన్నం అవుతున్నాయి. వాయు వేగం ఎక్కువగా లేకపోవడం వల్ల ఖాట్మాండు లోయలో కాలుష్యం కదలడం లేదని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.గత వారం నుంచి దేశంలో సుమారు వందకుపైగా ప్రాంతాల్లో అడువులు అంటుకున్నట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. దీనికి తోడు వాహన కాలుష్యం, ఇటుక బట్టీలు, నిర్మాణాల నుంచి వస్తున్న కాలుష్యం కూడా తోడవుతున్నట్లు అధికారులు చెప్పారు.