వాషింగ్టన్: అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ( CIA ) చీఫ్ తాలిబన్ల ( Taliban )తో రహస్య చర్చలు జరిపినట్లు వాషింగ్టన్ పోస్ట్ పత్రిక వెల్లడించింది. తాలిబన్ సహ వ్యవస్థాపకుడు ముల్లా అబ్దుల్ బరాదర్తో సీఐఏ చీఫ్ విలియం బర్న్స్ మాట్లాడినట్లు ఆ పత్రిక తెలిపింది. ఒకవేళ అదే నిజమైతే.. ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్లు మరోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్లలో బైడెన్ ప్రభుత్వం చేపట్టిన అత్యున్నత స్థాయి చర్చలు ఇవే. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్లో బర్న్స్ అత్యంత అనుభవజ్ఞుడైన దౌత్యవేత్త కాగా.. ఇటు తాలిబన్ల కీలక నేతల్లో బరాదర్ ఒకరు.
ఈ ఇద్దరి మధ్య రహస్య చర్చలు జరిగిన విషయాన్ని వెల్లడించిన వాషింగ్టన్ పోస్ట్.. అందులో ఏ అంశాలపై చర్చించాన్నది మాత్రం చెప్పలేదు. అయితే ఆఫ్ఘనిస్థాన్ వాసుల తరలింపు ప్రక్రియను ఆగస్ట్ 31లోపు ముగించకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని తాలిబన్లు హెచ్చరించిన నేపథ్యంలో.. ఆ అంశంపైనే ప్రధానంగా వీళ్లు చర్చించినట్లు సమాచారం.