ప్రధాని మోదీతో సమావేశంలో బైడెన్ ఆకాంక్ష
వాషింగ్టన్: భారత్, అమెరికా మధ్య సంబంధాలు బలోపేతం కావాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆకాంక్షించారు. కొవిడ్, వాతావరణ మార్పులు, వాణిజ్య భాగస్వామ్యం, పెట్టుబడులు, ఉగ్రవాద నిర్మూలన, అఫ్గాన్ పరిణామాలపై భారత్తో కలిసి పనిచేస్తామన్నారు. ఈ మేరకు ప్రధాని మోదీతో శుక్రవారం శ్వేతసౌధంలో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లను భారత్-అమెరికా బంధం పరిష్కరించగలదని బైడెన్ అన్నారు. మోదీ మాట్లాడుతూ.. రానున్న దశాబ్దం నిర్మాణంలో బైడెన్ నాయకత్వం కీలకపాత్ర పోషిస్తుందన్నారు. బైడెన్తో భేటీ అనంతరం క్వాడ్ సదస్సులో మోదీ పాల్గొన్నారు. ఇండో పసిఫిక్తోపాటు ప్రపంచవ్యాప్తంగా శాంతిసుస్థిరతలకు ఈ కూటమి కీలకం కానున్నదని సమావేశంలో మోదీ పేర్కొన్నారు. అంతకుముందు గురువారం అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహ్యారిస్తో మోదీ భేటీ అయ్యారు. కమల తాతయ్య పీవీ గోపాలన్కు సంబంధించిన ఒకప్పటి నోటిఫికేషన్లు, వారణాసికి చెందిన మీనాకారి చెస్బోర్డును మోదీ బహూకరించారు.