మిస్సిస్సిప్పీ: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. రెండు రోజులక్రితం టెక్సాస్లోని సీలోవిస్టా షాపింగ్ మాల్లో కాల్పుల ఘటన మరువకముందే తాజాగా మిస్సిస్సిప్పీలోని టేట్ కౌంటీలో దుండగుడు తుపాకీతో విరుచుకుపడ్డాడు. దీంతో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. పలువురు గాయపడ్డారు. టేట్ కౌంటీలోని అర్కబుట్ల రోడ్డులో ఉన్న ఓ షాప్లోకి చొరబడిన సాయుధుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడని అధికారులు వెల్లడించారు. దీంతో ఇద్దరు మరణించారు. అనంతరం సమీపంలో ఉన్న ఇంట్లోకి వెళ్లిన ఉన్మాది అక్కడ ఇద్దరిని కాల్చి చంపాడు. మరో ఇద్దరిని అర్కబుట్ల డ్యామ్ వద్ద కాల్చేశాడు. వరుస కాల్పుల్లో మొత్తం ఆరు మృతిచెందారని అధికారులు తెలిపారు. నిందితుడు కారులో పారిపోతుండగా పట్టుకున్నామని చెప్పారు.
కాగా, ఈనెల 16న టెక్సాస్లోని సీలో విస్టా షాపింగ్ మాల్ (Cielo Vista Mall )లో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఇందులో ఒకరు మరణించగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే కాల్పులకు తెగబడిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు రోజే మిచిగన్ స్టేట్ యూనివర్సిటీలో ఓ ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
— Governor Tate Reeves (@tatereeves) February 17, 2023