ఖైరతాబాద్/బేగంపేట్, మార్చి 26 : రక్తంలో గడ్డలను నివారించేందుకు రోజుకో మైలు నడవాలంటూ వైద్యులు సూచిస్తున్నారు. కిమ్స్ హాస్పిటల్, వాస్కులర్సొసైటీ ఆఫ్ ఇండియా, వాస్కులర్ సొసైటీ ఆఫ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సంయుక్తా ఆధ్వర్యంలో ఆదివారం నెక్లెస్రోడ్లోని జలవిహార్ వద్ద ‘వాక్ ఏ మైల్ టు స్టాప్ ది క్లాట్’ పేరుతో వాక్ నిర్వహించారు. ఈ వాక్ను సినీ నటి మంచు లక్ష్మి, కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బి.భాస్కర్ రావు, కిమ్స్ హాస్పిటల్ కన్సల్టెంట్ వాస్కులర్, ఎండో వాస్కులర్ సర్జన్ డాక్టర్ నరేంద్రనాథ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంచు లక్ష్మి మాట్లాడుతూ మహిళల్లో ఎక్కువగా డీవీటీ వచ్చే అవకాశం ఉందని, ఈస్ట్రోజన్ హార్మోనల్ థెరపీ తీసుకున్నవారు, గర్భనియంత్రణ కోసం మాత్ర వేసుకునే వారికి ఈ వ్యాధి వచ్చే ప్రమాదముందని తెలిపారు. ఈ వ్యాధిని ఆధునిక చికిత్స విధానాలతో పూర్తిగా నయం చేయవచ్చన్నారు.