సిటీబ్యూరో, ఆగస్టు 29 ( నమస్తే తెలంగాణ ) : అద్దె కార్ల బిల్లులు సకాలంలో చెల్లించాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. మూడేండ్ల నుంచి బిల్లులు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరల దృష్ట్యా నెలకు రూ.33వేలు సరిపోవడం లేదని, వాహనాల అద్దె ధరలు పెంచాలని రవాణా శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదని వాపోయారు. గత ఏడాది తమ కష్టాన్ని దోచుకుంటున్నారని, తమ హక్కులు కాలరాయబడుతున్నాయని మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేయగా ఇటీవల రవాణా శాఖకు ఫేర్ ధరలను పరిశీలించాలని ఆదేశించినట్టు తెలంగాణ ఫోర్ వీలర్ అసోసియేషన్ అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ తెలిపారు.
కానీ ఇప్పటి వరకు రవాణా శాఖ అధికారులు స్పందించలేదని పేర్కొన్నారు. 33 శాఖలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 34వేల కార్లను అద్దెకు వినియోగంలో ఉన్నాయని వివరించారు. గత ప్రభుత్వంలో నెలకు రూ.55వేలు చెల్లించేల ప్రణాళికలు చేసినట్టు వివరించారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 3 ఏండ్లు సమీపిస్తున్నా ఇప్పటి వరకు అద్దె కార్ల ఓనర్ల సమస్యలు పరిష్కరించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాఖలకు సంబంధించి అన్ని అద్దె కార్ల బిల్లులు విడుదలయ్యేల ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చొరవ తీసుకోవాలని కోరారు.