అభివృద్ధి కోసం సమన్వయంతో పనిచేస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. హబ్సిగూడలోని సుప్రబాత్ హోటల్లో నియోజకవర్గం అభివృద్ధి పనులు, సమస్యల పరిష్కారానికి బుధవారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి, జోనల్ కమిషనర్ ఉపేందర్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యలపై డివిజన్లవారీగా చర్చించారు. అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాలు, సమస్యలు, చేపట్టాల్సిన పనులపై సమీక్షించారు.
ప్రధానంగా మంచినీరు, బోర్వెల్స్, యూజీడీ, ఎలక్ట్రిసిటీ నూతన స్తంభాల ఏర్పాటు, గ్రేవ్యార్డు, చెరువుల అభివృద్ధి, డబుల్ బెడ్రూం ఇండ్లు, ట్రాఫిక్ సమస్యలు, మహిళా పోలీస్స్టేషన్ ఏర్పాటు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, మార్కెట్లు, బస్తీ దవాఖానలు, తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. అభివృద్ధి పనులకు ఆటంకం లేకుండా చూడాలని, పలు శాఖలు సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు. శాఖల మధ్య సమన్వయంతో పనులు వేగవంతంగా పూర్తిచేయవచ్చన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనుల్లో ఇతరులకు ఆదర్శంగా ఉండేలా ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
స్వచ్ఛత సాధించడానికి సమన్వయంతో పనిచేయాలని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని, చెత్తసేకరణకు ప్రజలు సహకారం అందించాలన్నారు. ఉప్పల్ సర్కిల్ కార్యాలయం ఆవరణలో స్వచ్ఛ సర్వేక్షణ్ తడి, పొడి చెత్త సేకరణ వాహనాలను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాలనీల్లో చెత్తపేరుకుపోకుండా చూడాలని, ప్రతి ఇంటి నుంచి చెత్తసేకరణ చేపట్టాలన్నారు. స్వచ్ఛతలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అరుణకుమారి, కార్పొరేటర్లు బన్నాల గీతాప్రవీణ్ ముదిరాజ్, చేతన హరీశ్, శ్రీవాణి, రజితాపరమేశ్వర్రెడ్డి, ఈఈ నాగేందర్, టౌన్ప్లానింగ్ ఏసీపీ శ్రావణి, పీఓ రమాదేవి, శానిటేషన్ సూపర్వైజర్ సుదర్శన్, తదితరులు పాల్గొన్నారు.