చాంద్రాయణగుట్ట, జనవరి 11 : పాతనగరంలోని ఫలక్నుమా జూనియర్ కళాశాల దిశ మారనున్నది. రూ.30 కోట్ల నిధులతో నూతన భవన నిర్మాణం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. నాణ్యతలో ఏ మాత్రం రాజీపడకుండా నిర్మాణం పనులు సకాలంలో పూర్తి చేసేందుకు సదరు నిర్మాణ సంస్థ కృషి చేస్తున్నది. కార్పొరేట్ స్థాయిలో వసతులు, జూనియర్ కళాశాల ఆవరణలో విశాలమైన మైదానంలో ఏకకాలంలో కొత్తగా మూడు భవనాలను నిర్మిస్తున్నారు.
మూడు నూతన భవనాల నిర్మాణం..
ఫలక్నుమా జూనియర్ కళాశాల ఎనిమిది ఎకరాల విశాలమైన స్థలంలో ఉన్నది. నిధులు రావడంతో నెల రోజులుగా పనులు కొనసాగుతున్నాయి. నూతన డిగ్రీ కళాశాల భవనం 900 గజాల స్థలంలో నిర్మాణం అవుతుంది. మొత్తం వైశాల్యం 10400 ఫీట్ల విస్తరణలో పనులు జరుగుతున్నాయి.భూమిలో ఏడు ఫీట్ల లోతు తవ్వి పిల్లర్ల నిర్మాణం చేపట్టారు. 96 కాలాలతో డిజైన్ ప్రకారం జీ+1 భవనం నిర్మాణం కానున్నది. రెండో కళాశాలను 1200 గజాల స్థలంలో నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు 50 కాలాలు పూర్తి చేసుకున్నది. జీ+4 గా ఈ భవన నిర్మాణం జరుగుతున్నది. రెండు భవనాల నిర్మాణ వ్యయం రూ.10 కోట్లు అవుతుంది. వీటితో పాటు మైనార్టీ రెసిడెన్సియల్ కళాశాలను 1500 గజాల స్థలంలో నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణానికి రూ. 20 కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నారు.జీ+6 నూతన భవనం నిర్మాణం కానున్నది. సకాలంలో పూర్తయితే వచ్చే విద్యా సంవత్సరం అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆర్.వి.ఎం.నిర్మాణ సంస్థ ఇంజినీర్ నామ్దేవ్ బృందం స్పష్టం చేశారు.
అద్భుతమైన డిజైన్లో నిర్మాణం..
కొత్త కళాశాలలు అద్భుతమైన డిజైన్లో నిర్మాణం కానున్నాయి. పిల్లర్ గుంతలతో పాటు కాలాలు పూర్తి అయ్యాయి. ఏకకాలంలో పనులు పూర్తయ్యేలా ఇంజినీరింగ్ విభాగం సిబ్బంది కృషి చేస్తున్నారు. త్వరలోనే స్లాబ్ నిర్మాణం పనులు పూర్తవుతాయి. ఇంటీరియల్తో పాటు ఫర్నిచర్ విషయంలో కొత్తగా ఆలోచన చేస్తున్నాం. ఉపాధ్యాయుల కార్యాలయాలు సౌకర్యవంతంగా తీర్చిదిద్దానున్నారు. ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నవీన్మిట్టల్, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ సహకారంతో పనులు సాగుతున్నాయి.
– డాక్టర్ వసంత కుమారి , ఫలక్నుమా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్