సిటీబ్యూరో, ఆగస్టు 27(నమస్తే తెలంగాణ) : నగరంలోని చారిత్రాత్మక పైగా ప్యాలెస్ ప్రాంగణంలో సుందరీకరణ పేరిట పర్యావరణ విధ్వంసం జరుగుతుంది. ఆధునీకీకరణ కోసం అడ్డుగా వచ్చిన భారీ వృక్షాలను హెచ్ఎండీఏ తొలగిస్తుంది. నిర్బంధ విధానంలో ఎవరిని అనుమతించకుండా గుట్టుగా చెట్లను తొలగిస్తున్నారు. అయితే స్థానికులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. పైగా ప్యాలెస్ ప్రాంగణంలో సాగుతున్న చెట్ల నరికివేతపై సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. దశాబ్దాల చరిత్ర కలిగిన 50కి పైగా భారీ చెట్లను హెచ్ఎండీఏ అధికారులు రాత్రికి రాత్రే తొలగించారు. ఇందులో పాత ఇత్తడి, వేప వంటి వట వృక్షాలు కూడా ఉన్నాయని సమాచారం.
నగరం మధ్యలో పర్యవరణానికి, పచ్చదనానికి, స్వచ్ఛమైన గాలికి కేంద్రంగా ఉన్న ఈ బేగంపేట్ పైగా ప్యాలెస్ ఈ ప్రాంతంలో చెట్లను తొలగించడం వలన స్థానికంగా పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా, కనీ సం రీలొకేషన్ విధానాన్ని అమలు చేయకుండా ఉన్న చెట్లను నరికివేయడంపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి పనుల కోసం చెట్లను నరికే బదులు, వాటిని కాపాడుకుంటూనే, ఆధునీకీకరణ పనులు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. చెట్లను నరికివేయడం నిలిపివేయాలంటున్నారు. కొత్త మొక్కలను నాటాలని, పర్యావరణ సంఘాలు ఆందోళనకు దిగాయి, అభివృద్ధి పేరిట నగరంలో ఉన్న పచ్చదనం కనుమరుగైపోతుందని, భవిష్యత్లో వాతావరణ మార్పులకు తీవ్ర ఉష్ణోగ్రతలకు దారితీస్తుందని స్థానికులు హెచ్చరిస్తున్నారు.
హెచ్ఎండీఏ ప్రధాన కార్యాలయాన్ని పైగా ప్యాలెస్కు తరలించే క్రమంలో ఆధునీకీకరణ పనులు చేపడుతున్నారు. 13 నెలలుగా హెచ్ఎండీఏ ప్రధాన కార్యాలయాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అమెరికన్ కాన్సులేట్ కార్యాలయాన్ని తరలించిన తర్వాత మైత్రీవనంలోని హెచ్ఎండీఏ ప్రధాన కార్యాలయంతోపాటు, ఇతర ప్రాంతాల్లో ఉన్న విభాగాలన్నింటిని పైగా ప్యాలెస్కు తరలించేందుకు గతేడాది మార్చి నుంచే ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో మౌలిక వసతులు, మరమ్మతులు, ఆధునీకీకరణ కోసం ఇప్పటికే రూ.5 కోట్లను వెచ్చించగా.. తాజాగా మరో రూ. 3 కోట్లతో అభివృద్ధి చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
ఈ ఏడాది మార్చి నాటికి హెచ్ఎండీఏ కార్యాలయాన్ని తరలించేందుకు అనువుగా లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో మౌలిక వసతులను కల్పిస్తున్నామని చెప్పినా.. ఇంకా పనులు సాగుతూనే ఉన్నాయి. హెచ్ఎండీఏ ఆఫీస్ అవసరాలకు అనుగుణంగా ఏర్పాటు చేశారు. ఇందుకు అవసరమైన ఫర్నిచర్, ప్రత్యేక ఛాంబర్ల వసతులు, భవనంలో ఉన్న సదుపాయాలు, తాగునీటి సరఫరా, మురుగు నీటి నిర్వహణ, మార్పులు చేర్పులు చేశారు. అయితే గతేడాది ఆగస్టు మొదటి వారంలోనే ఆఫీసును తరలిస్తారని ఉన్నతాధికారులు కూడా వెల్లడించారు. దీంతోపాటు భారీ మల్టీ లెవల్ పార్కింగ్ యార్డును ప్రాంగణంలో ఏర్పాటు చేయనుండగా.. ప్రాజెక్టు పనుల పేరిట చెట్లను అటవీ శాఖ అనుమతులతో తొలగించినట్లుగా అధికారులు తెలిపారు.