దుండిగల్,మే15 : ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని.. దోపిడీకి పాల్పడుతున్న ఓ ముఠాలోని ఆరుగురిని బాచుపల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. శనివారం స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కూకట్పల్లి ఏసీపీ సురేందర్రావు, ఇన్స్పెక్టర్ నర్సింహారెడ్డితో కలిసి వివరాలు వెల్లడించారు. ఫిల్మ్నగర్ సమీపంలో ఉన్న ఇందిరానగర్కు చెందిన వినయ్, మహేశ్, విజయ్, అర్జున్, దినేశ్, మనుదీప్తో పాటు మరో నలుగురు కలిసి ఒక గ్యాంగ్గా ఏర్పడ్డారు. వీరంతా పలు కంపెనీల్లో ఆఫీస్ బాయ్స్గా, డెలివరీ బాయ్స్గా పనిచేస్తున్నారు.. పగలంతా పని చేసి.. రాత్రి 8.30 నుంచి ఉదయం 5 గంటల వరకు రోడ్లపై తిరుగుతూ.. ఒంటరిగా ఉండే మహిళలను టార్గెట్ చేసుకుని దోపిడీకి పాల్పడుతున్నారు.
కాగా.. శుక్రవారం రాత్రి బాచుపల్లి చౌరస్తాలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఆరుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో దోపిడీ విషయం బయటపడింది.. బాచుపల్లి, జగద్గిరిగుట్ట, జీడిమెట్ల, బొల్లారం, బంజారాహిల్స్, దుండిగల్ పీఎస్ల పరిధిల్లో వారిపై పది కేసుల వరకు నమోదయ్యాయని తేలింది. ఈ గ్యాంగ్లో మరో నలుగురు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. వారి నుంచి 11 సెల్ఫోన్లు, 1800 నగదు, రెండు బైక్లు స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో ఎస్ఐ రాజుయాదవ్, క్రైం సిబ్బంది పాల్గొన్నారు.