మారేడ్పల్లి, జూన్ 5 : రాష్ట్రం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ విజన్తో 24 గంటలూ విద్యుత్ సరఫరా సాధ్యమైందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఆధ్వర్యంలో సికింద్రాబాద్, కంటోన్మెంట్, సనత్నగర్ నియోజకవర్గాల తెలంగాణ విద్యుత్ విజయోత్సవం (విద్యుత్ ప్రగతి) వేడుకలు సోమవారం మారేడ్పల్లిలోని మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కంటోన్మెంట్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు మన్నె క్రిశాంక్, గజ్జెల నాగేశ్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ… దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే వివిధ రంగాలకు, వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే అంధకారంతో ఉండాలని ఉమ్మడి పాలకులు ఎగతాళి చేశారని, వాటిని కొట్టి పారేస్తూ అనేక వ్యయ ప్రయాసల కోర్చి సీఎం కేసీఆర్ విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేశారని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి విద్యుదుత్పత్తి సామర్థ్యం 7,778 మెగావాట్లు కాగా… నేడు 18,453 మెగావాట్లకు పెంచుకోగలిగామని పేర్కొన్నారు. సౌర విద్యుదుత్పత్తిలో తెలంగాణ దేశంలో అగ్రభాగాన నిలిచిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వేసవిలో విద్యుత్ సరఫరా కోసం ధర్నాలు, రాస్తారోకోలు, సబ్ స్టేషన్ల ఎదుట ఆందోళనలు జరిగేవని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని రంగాలకు 24 గంటల కరెంటును అందిస్తున్నది దేశంలో ఒక్క బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో కూడా 24 గంటల విద్యుత్ సరఫరా కావడం లేదని చెప్పారు. విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం, సరఫరాను పెంచుకోవడంతో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగి ఫలితంగా.. దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణగా తెలంగాణ మారిందని వివరించారు. అనంతరం కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి మాట్లాడుతూ… ఉమ్మడి పాలనలో పవర్ హాలిడేస్ కారణంగా చాలా పరిశ్రమలు మూతపడ్డాయని, కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత నో పవర్ హాలిడేస్ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రికల్ ఎస్సీ రవికుమార్, డీఈలు శ్రీధర్, పర్వతాలు, సుచేంద్రనాథ్, కార్పొరేటర్లు లక్ష్మీబాల్రెడ్డి, మాజీ కార్పొరేటర్లు రూప, శేషుకుమారి, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు మహేశ్వర్రెడ్డి, మాజీ బోర్డు సభ్యులు పాండుయాదవ్, ప్రభాకర్ పాల్గొన్నారు.