సిటీబ్యూరో, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): స్టాక్ ట్రేడింగ్లో లాభాలిప్పిస్తామంటూ నమ్మించి ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తున్న ప్రైవేట్ ఉద్యోగికి సైబర్నేరగాళ్లు రూ. 8.75 లక్షలు టోకరా వేశారు. వనస్థలిపురం, ఎన్టీఓ కాలనీకి చెందిన బాధితుడి ఫోన్ నంబర్ను ఈ8811-కొటక్ సెక్యూరిటీస్, ఎలైట్ క్యాపిటల్ ప్రైవేట్ సర్కిల్ అనే పేరుతో ఉన్న వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేశారు. ఆ గ్రూప్లో పలువురు తమకు లాభాలొచ్చాయంటూ స్క్రీన్ షాట్స్ షేర్ చేస్తూ వెళ్లారు. గ్రూప్ అడ్మిన్గా రాజీవ్ సప్తరిషి, అన్విక మేహ్రలు వ్యవహారిస్తూ ఆ గ్రూప్లో ఉన్న వాళ్లకు తమ సూచనలు పాటిస్తే అందరు లాభాలు పొందుతారంటూ నమ్మిస్తూ కోటొప్రో అనే యాప్లో అకౌంట్ క్రియేట్ చేయించి, మొదట రూ. 30 వేలు పెట్టుబడి పెట్టించారు. దీంతో కొన్ని లాభాలు తన అకౌంట్లో స్క్రీన్పై కన్పించాయి.
యాప్లో రూ. 10.45 లక్షల వరకు స్టాక్స్ కొనేందుకు అర్హత ఉందని సూచించారు. దీంతో బాధితుడు దఫ దఫాలుగా రూ. 9.54 లక్షలు పెట్టుబడి పెడుతూ వెళ్లాడు. స్క్రీన్పై భారీ లాభాలు కన్పించాయి. వాటిని విత్ డ్రా చేసుకోవడానికి ప్రయత్నించడంతో అకౌంట్ బ్లాక్ అయ్యిందని, కమీషన్ చెల్లించాలంటూ షరతు విధించారు. బాధితుడు అందుకు నిరాకరించి ఇదంతా మోసమని గుర్తించాడు. అయితే రూ. 9.54 లక్షలు పెట్టుబడి పెట్టడంతో అందులో రూ. 78,855 తిరిగి లాభంగా ఇచ్చారు, ఇలా రూ. 8.75 లక్షలు బాధితుడు మోసపోయాడు. ఈ మేరకు మల్కాజిగిరి సైబర్క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తుచేపట్టారు.