ఆర్కేపురం, డిసెంబర్ 10 : క్రీడలతో ఒత్తిడి దూరమవుతుందని ఐఏఎస్ రామకృష్ణారావు అన్నారు. శాంతిభద్రతల నిర్వహణలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్గా నిలిచిందని చెప్పారు. నాలుగురోజులుగా సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన 4వ వార్షిక స్పోర్ట్స్ మీట్ – 2021 ముగింపు కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన రామకృష్ణారావు విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పౌరులకు 24 గంటల పాటు అవిశ్రాంతంగా సేవలందిస్తున్న పోలీసులు శారీరక, మానసిక దృఢత్వాన్ని కలిగి ఉండాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. జీవనశైలి వ్యాధులను నివారించేందుకు క్రీడలు ఎంతో అవసరమన్నారు. రాచకొండ సీపీ మహేశ్ భగవత్ మాట్లాడుతూ మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు క్రీడలు ఎంతగానో ఉపయోగపడుతాయని అన్నారు. కార్యక్రమంలో ఎల్బీనగర్ డీసీపీలు సన్ప్రీత్సింగ్, రక్షితామూర్తి, నారాయణరెడ్డి, యాదగిరి, శిల్పవల్లి,అడిషనల్ డీసీపీ సమీర్ పాల్గొన్నారు.