సిటీబ్యూరో, జూలై 13 (నమస్తే తెలంగాణ): సిగ్నల్ రహిత ప్రయాణమే లక్ష్యంగా జీహెచ్ఎంసీ ఎప్పటికప్పుడు నూతన ప్రాజెక్టులను చేపడుతున్నది. ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు (ఎస్ఆర్డీపీ) ద్వారా ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపుతున్నారు. ఇందులో భాగంగానే ఎన్నో ఏండ్లుగా రైల్వే క్రాసింగ్ల వద్ద వాహనదారులు, పాదచారులు పడుతున్న కష్టాలకు శాశ్వతంగా చెక్ పెట్టాలని తాజాగా నిర్ణయించారు. ఈ మేరకు 16 రైల్వే లెవల్ క్రాసింగ్ల వద్ద రూ. 1230కోట్లతో రోడ్ ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ), రోడ్ అండర్ బ్రిడ్జి (ఆర్యూబీ)లను నిర్మించాలన్న ప్రతిపాదిత ప్రాజెక్టులను కార్యరూపంలోకి తీసుకువచ్చేలా తాజాగా ఇంజినీరింగ్ విభాగం అధికారులు చర్యలకు ఉపక్రమించారు.
16 చోట్ల రైల్వే శాఖ సమన్వయంతో చేపట్టనున్న ప్రాజెక్టులకు తొలుత ప్రభుత్వం నుంచి పరిపాలన అనుమతులు తీసుకునేలా చర్యలు చేపడుతున్నారు. ప్రభుత్వ ఆదేశాలనుసారం త్వరలో రైల్వే శాఖ అధికారులతో ప్రత్యేక సమావేశమై ఏ ఏ లెవల్ క్రాసింగ్ల వద్ద పనులు తొలుత చేపట్టాలో నిర్ణయించి ఈ ప్రాజెక్టులను పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా రైల్వే లెవల్ క్రాసింగ్ల వద్ద వాహనదారులకు, పాదచారులకు రైలు రాకపోకలతో ఎలాంటి సంబంధం లేకుండా రైల్వేలైన్పై నుంచి గానీ, దాని కింద నుంచి గానీ సాఫీగా ప్రయాణించేందుకు వీలుగా దోహదపడనున్నాయి.