హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ అంటేనే చారిత్రక నగరం. ఏ మూల తొంగిచూసినా చారిత్రకతే కనిపిస్తుంది. ఇలాంటి చారిత్రక కట్టడాలను పరిరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తున్నది. చార్మినార్, మక్కామసీదు, ఎంజే మార్కెట్లను పునరుద్ధరించింది. అనేక మెట్ల బావులను వినియోగంలోకి తీసుకొచ్చింది. ఇదే కోవలో తాజాగా అఫ్జల్గంజ్ స్టేట్ లైబ్రరీ చేరింది. నిజాం కాలం నుంచి ఇప్పటివరకు విద్యార్థులు, ఉద్యోగార్థులకు సేవలందిస్తున్న హైదరాబాద్ అప్జల్గంజ్లోని స్టేట్ సెంట్రల్ లైబ్రరీ పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యాయి. చారిత్రక వారసత్వ కట్టడమైన ఈ లైబ్రరీ భవనాన్ని సంరక్షిస్తూనే.. అధునాతన సొబగులతో తీర్చిదిద్దుతున్నారు. ఇందుకు ప్రభుత్వం మొత్తం రూ.13.45 కోట్ల నిధులను వెచ్చిస్తున్నది. మరో తొమ్మిది నెలల్లో పనులను పూర్తిచేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకొన్నారు.
అతిపెద్ద గ్రంథాలయాల్లో ఒకటి
అఫ్జల్గంజ్ స్టేట్ సెంట్రల్ లైబ్రరీకి గొప్ప చరిత్ర ఉన్నది. దేశంలో 10 అతిపెద్ద గ్రంథాలయాల్లో ఇది ఒకటి కావడం విశేషం. మొదట అసఫియా లైబ్రరీ పేరిట అబిడ్స్లో ఈ గ్రంథాలయాన్ని నిర్వహించారు. ఈ గ్రంథాలయ భవన నిర్మాణానికి 1932లో శంకుస్థాపన చేశారు. అఫ్జల్గంజ్లోని 2.9 ఎకరాల విస్తీర్ణంలో అప్పట్లో రూ. 5 లక్షలు వెచ్చించి ప్రస్తుతమున్న భవనాన్ని కట్టారు. ప్రముఖ అర్కిటెక్ట్ అజీజ్ అలీ భవన డిజైన్లు రూపొందించారు. పెద్దగదులు, ఎత్తయిన పైకప్పుతో రాజప్రసాదాన్ని తలపించేలా భవనముంటుంది. 1936లో గ్రంథాలయం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చింది. ఈ గ్రంథాలయంలో 5లక్షల పుస్తకాలున్నాయి. 19వ శతాబ్దం నాటి పుస్తకాలే కాకుండా 10 దేశ, విదేశీ భాషల పుస్తకాలు లభిస్తాయి.
పునరుద్ధరణ ఇలా..
పురాతన భవనం కావడంతో గోడల పెచ్చులూడటం, పైకప్పు లీకేజీ వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే క్షేత్ర కన్సల్టెన్సీ ద్వారా అధ్యయనం చేయించి అధికారులు నివేదిక తెప్పించుకొన్నారు. భవనానికి రూ.7.5 కోట్లు, ఇతరత్రా మరమ్మతులకు రూ. 5 .5కోట్లకు పైగా నిధులను ఖర్చుచేసేలా ప్రతిపాదనలు రూపొందించారు. ఆయా నివేదికల ప్రకారం హెరిటేజ్ భవనాన్ని కాపాడేలా పాత పద్ధతుల్లో పూర్తిగా సుర్కీ సున్నాన్ని వినియోగించి పునరుద్ధరణ పనులు చేపడుతున్నారు. ఇసుక, బెల్లం, అత్తిపండ్లు వేసి తిప్పుతూ భవన ప్రాంగణంలోనే సుర్కీ సున్నాన్ని తయారు చేస్తున్నారు. ఈ సున్నాన్ని పైకప్పుపై పూయడమే కాకుండా లీకేజీలు అవుతున్న చోట, పెచ్చులూడుతున్న ప్రాంతాల్లో పూస్తున్నారు. అలాగే శానిటరీ పైపులు, మ్యాన్హోళ్ల మరమ్మతులు, ఎలక్ట్రికల్ వర్క్స్, గ్రీనరీ, గార్డెనింగ్ అభివృద్ధి పనులు చేపడుతున్నారు.