ఈ ఏడాది భానుడి భగభగకు.. వరుణుడు బ్రేక్ వేశాడు. వేసవి వచ్చిందంటే చాలు భానుడు నిప్పులు కురిపించేది. ఫిబ్రవరి నుంచి మే వరకు నగర వాసులు ఇంటినుంచి కాలు బయటపెట్టాలంటేనే వణికిపోయేవారు. మధ్యాహ్నం అయ్యిందంటే చాలు.. నగర రోడ్లు కర్ఫ్యూను తలపించేవి. అనేక మంది వడదెబ్బతో మృత్యుఒడికి చేరేవారు. కాని ఈ ఏడాది ఆ పరిస్థితులు కనిపించలేదు. మండువేసవిలోనూ.. వరుణుడు కరుణించాడు. ఏప్రిల్-మే నెలల్లో అకాల వర్షాలు, ఈదురు గాలులు, తుఫాను ప్రభావంతో సాధారణ స్థాయిని మించి వర్షాపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మే 18న హైదరాబాద్ జిల్లా పరిధిలో 8 మి.మీ, రంగారెడ్డి పరిధిలో 4.2 మి.మీ, మేడ్చల్ పరిధిలో 3.0 మి.మీ వర్షపాతం నమోదైంది.
మే నెల ప్రారంభం నుంచే కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం ఉదయం పలు ప్రాంతాల్లో ఓ మోస్తారు నుంచి తేలికపాటి వర్షం పడింది. ఎండల తీవ్రత అధికంగా ఉండే ఈ సమయంలో వర్షాలు కురుస్తుండటంతో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 డిగ్రీలు తక్కువే నమోదవుతున్నాయి. దీంతో నగర వాసులు ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందుతున్నారు. మే నెల ప్రారంభం నుంచి పగటి ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా 39 నుంచి 42డిగ్రీల మధ్య నమోదవుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాగా గత ఏడాది వేసవి కాలంలోనూ భారీ వర్ష పాతం నమోదైంది. ముఖ్యంగా 2020 మే 17న గ్రేటర్ పరిధిలో 16.9మి.మీ. వర్షం కురువగా.. నెల మొత్తంలో 42.3 మి.మీ. వర్షాపాతం నమోదైందని అధికారులు తెలిపారు.