సిటీబ్యూరో, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): యాక్సిడెంట్ ఫ్రీ ప్రాంతాలుగా మార్చేందుకు రాచకొండ పోలీసులు నడుం బిగించారు. గతంలో జరిగిన ప్రమాదాలను విశ్లేషిస్తూ చేపట్టాల్సిన పనులపై ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాలు జరిగిన బ్లాక్ స్పాట్స్ను వివిధ ప్రభుత్వ శాఖాధికారులతో కలిసి పరిశీలించి అక్కడ చేపట్టాల్సిన తాత్కాలిక, దీర్ఘకాలిక పనులపై అధ్యయనం చేస్తున్నారు. మరోసారి ఆ స్పాట్లో ప్రమాదం జరగకుండా చూస్తున్నారు. అక్టోబర్లో 9 నుంచి 15 వరకు రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మొత్తం 10 మంది మరణించారు.
ఈ ఘటనలకు మానవ తప్పిదాలే కారణమని పోలీసులు తేల్చారు. అంతేకాక ట్రాఫిక్ నిబంధనలు పాటించని 47,224 మంది వాహనదారులపై కేసులు నమోదు చేసి చలాన్లను జారీ చేశారు. ఇలా రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా రాచకొండ ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.