కేపీహెచ్బీ కాలనీ, అక్టోబర్ 6 : విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఓ కానిస్టేబుల్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన సంఘటన కేపీహెచ్బీ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కేపీహెచ్బీ కాలనీ సీఐ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ జిల్లా లింగాపూర్ గ్రామానికి చెందిన బైరి ఈశ్వర్ (44) ఆల్విన్కాలనీ కమలాప్రసన్న నగర్లో భార్య స్వప్న, ఇద్దరు పిల్లలతో కలిసి నివాసముంటున్నాడు. ఈశ్వర్ శంషాబాద్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. మంగళవారం రాత్రి విధులు ముగించుకుని ఒంటిగంట సమయంలో తన కారులో (ఏపీ 28 ఏఎస్ 8932) హైటెక్ సిటీ మీదుగా కేపీహెచ్బీకాలనీకి వస్తున్నాడు.
మార్గమధ్యమైన కేపీహెచ్బీకాలనీ ఫ్లైఓవర్పై కేఎస్ బేకరీ వద్ద ముందుగా వెళ్తున్న టిప్పర్ లారీ (టీఎస్ 08 యూహెచ్ 1693) సడన్ బ్రేక్ వేయడంతో కారు వెనుకనుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న ఈశ్వర్కు తీవ్రగాయాలయ్యాయి. వైద్య పరీక్షల నిమిత్తం సికింద్రాబాద్లోని ఓ దవాఖానకు తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా కానిస్టేబుల్ ఈశ్వర్ గతంలో కేపీహెచ్బీకాలనీ, కూకట్పల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో విధులు నిర్వహించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు టిప్పర్ డ్రైవర్ మహ్మద్ ఎజాజ్ను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మేడ్చల్ రూరల్, అక్టోబర్ 6 : మేడ్చల్ మండలం లింగాపూర్కు చెందిన కానిస్టేబుల్ బైరి ఈశ్వర్కు కన్నీటి వీడ్కోలు పలికారు. వికారాబాద్ ఏసీపీ సంజీవరావుతో పాటు సహచర ఉద్యోగులు గ్రామానికి విచ్చేసి పోలీసు లాంఛనలతో వీడ్కోలు పలికారు. గాలిలో మూడు రౌండ్లు కాల్పులు జరిపి, నివాళులర్పించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు శైలజావిజయానందారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దయానంద్యాదవ్, సర్పంచ్ బైరి లక్ష్మీసంజీవ, మాజీ సర్పంచ్లు రాజమల్లారెడ్డి, జగన్రెడ్డి, బేరి ఈశ్వర్, గ్రామస్తులు పాల్గొన్నారు.