సిటీబ్యూరో, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ) : రాజకీయ పలుకుబడి ఉంటే చాలు నేరస్తులను పోలీసులు టచ్ చేయాలంటే ఆలోచిస్తున్నారు. ఇటీవల నాగోల్ పోలీస్స్టేషన్ పరిధిలో సుప్రీం వైన్స్లో జరిగిన రౌడీషీటర్ హత్య కేసులో కీలక నిందితుడు ఇంకా పరారీలోనే ఉండటం దీనికి నిదర్శనం. సూత్రధారులలో ఒకడైన మహేశ్కి అధికార కాంగ్రెస్ పార్టీలోని మంత్రులు, ఎమ్మెల్యేలు వారి కుటుంబ సభ్యులతో ఉన్న అనుబంధాలే అరెస్ట్ కాకుండా కాపాడుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిందితుడు కాంగ్రెస్ నాయకులతో తిరుగుతున్న ఫొటోలు, వీడియోలు సోషల్మీడియాలో హల్చల్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో కొంత మంది నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు, హత్య కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న మహేశ్ను ఇప్పటికీ పట్టుకోలేదు.
ఈ నెల 14న సుప్రీం వైన్స్లో అందరు చూస్తుండగానే ఒక గ్యాంగ్ వచ్చి కత్తులు, కర్రలతో దాడి చేసి నయీమ్ అనే రౌడీషీటర్ను దారుణంగా హత్య చేసిన విషయం సంచలనం సృష్టించింది. ఖమ్మంలో ఈ హత్యకు పథకం వేసి.. నగరంలో దానిని అమలు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. హత్యలో పాల్గొన్న వారిలో 8 మందిని అరెస్ట్ చేశామంటూ రెండు రోజుల అనంతరం మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి విలేకరుల సమావేశంలో వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితులు సయ్యద్ రబ్బాని, కనకం ఉమా మహేశ్ అంటూ పోలీసుల దర్యాప్తులో తేలింది. రబ్బానితో పాటు మరో ఏడుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు మహేశ్ను అరెస్ట్ చేయకపోవడంపై పలు అనుమానాలకు తావిస్తోంది.
మహేశ్ కాంగ్రెస్ పార్టీలోని ప్రముఖ నాయకులతో కలిసి హల్చల్ చేస్తున్న వీడియోలు సోషల్మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఖమ్మం జిల్లాకు చెందిన ఒక మంత్రి కొడుకుకు ప్రధాన అనుచరుడిగా ఉన్నాడంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే నిందితుడు అరెస్ట్ కాలేదని, పోలీసులు కూడా నిందితుడిని పట్టుకోవడానికి ప్రయత్నించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిందితుడిని కాపాడుతున్నదెవరు, ఎక్కడ ఆశ్రయం పొందుతున్నాడనేది స్థానికులు మాట్లాడుకుంటున్నారు. రాజకీయంగా, డబ్బు పరంగా పలుకుబడి ఉందంటే అరెస్ట్లను తప్పించుకోవచ్చని పలు కేసులలో బయటపడుతుందని, ఇప్పుడు నాగోల్ కేసులోను రాజకీయ పలుకుబడి ఉన్న మహేశ్ పోలీసులకు దొరకకుండా సేఫ్ జోన్లో ఆశ్రయం పొందుతున్నాడానే సందేహాలను ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.
వినాయక నవరాత్రులు జరుగుతుండడంతో దృష్టి పెట్టలేకపోతున్నామని త్వరలోనే పట్టుకుంటామంటూ నాగోల్ పోలీసులు చెబుతున్నారు. అవన్ని ఉత్త మాటలేనని రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే నిందితుడిపై పోలీసులు ఫోకస్ పెట్టడం లేదంటూ ఆరోపణలు వస్తున్నాయి. పోలీసులు నిందితుడిని పట్టుకోకుండా చూసి చూడనట్లు వదిలేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి ప్రజల్లో భయాన్ని పోగొట్టాల్సిన పోలీసులు, ఆ విషయాన్ని మర్చిపోయి, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గొతున్నారంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.