అంబర్పేట, మే 16: వరద ముంపు సమస్య పరిష్కారం కోసం చేపట్టిన శివం రోడ్డులోని నాలా వెడల్పు పనులు వేగంగా సాగుతున్నాయి. రాబోయే వర్షాకాలం నాటికి పనులను పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు ముందుకు సాగుతున్నారు. ఈ పనులు పూర్తయితే ఇక్కడి ప్రాంతం వారికి వరద ముంపు సమస్య తప్పనున్నది.
నల్లకుంట డివిజన్ శివం నుంచి కరూర్ వైశ్యా బ్యాంకు, తరుణి సూపర్ మార్కెట్, పాపాజీ దాబా నుంచి ఛేనంబర్ వరకు సుమారు మూడు కిలో మీటర్ల దూరం వరకు ఉన్న నాలాను వెడల్పు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న నాలా కుచించుకుపోవడంతో వర్షం కురిసినప్పుడు వరద దాని పై నుంచి ప్రవహిస్తు రోడ్డుపైకి వస్తున్నది. ఆ సమయంలో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. ఈ నాలాను ఆనుకొని ఉన్న కాలనీలు, బస్తీలు జలమయమవుతున్నాయి. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ఈ ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో స్థానిక కాలనీ, బస్తీవాసులు విషయాన్ని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ దృష్టికి తీసుకెళ్లారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత జీహెచ్ఎంసీ అధికారులతో మాట్లాడి వెంటనే పనులను కూడా చేపట్టారు. నాలాను వెడల్పు చేస్తూ ఎత్తు కూడా పెంచుతున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల నాలాపై స్లాబు కూడా వేశారు. మిగతా చోట్ల పనులు వేగంగా జరుగుతున్నాయి. రాబోయే వర్షాకాలం నాటికి దీన్ని పూర్తి చేయాలని సంకల్పించారు. ఈ పనులు పూర్తయితే నాలా పరిసర ప్రాంతాల ప్రజలతో పాటు శివం మెయిన్ రోడ్డుపై ఉండే వ్యాపార, వాణిజ్య ప్రాంతాల వాసులకు కూడా ఇబ్బంది తప్పుతుంది. ఈ నేపథ్యంలో పనులు వేగంగా పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.
శివం నుంచి ఛే నంబర్ వరకు ఉన్న నాలా వెడల్పు, ఎత్తు పెంచే పనులు పూర్తయితే ప్రజల ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయి. ప్రతి ఏటా వర్షాకాలంలో ఈ ప్రాంతాల వరకు వరద ముంపు సమస్య ఉంది. రోడ్డుపై నుంచి వరద జోరుగా ప్రవహించి రాకపోకలకు కూడా ఇబ్బంది కలుగుతుంది. స్థానికుల కోరిక మేరకు నిధులు మంజూరు చేయించి ఈ పనులు చేపట్టాము. రాబోవు వర్షాకాలం నాటికి పనులు పూర్తి చేయాలని అధికారులు చెప్పాను. – కాలేరు వెంకటేశ్, ఎమ్మెల్యే