అభివృద్ధి పనుల ప్రారంభంలో ఎమ్మెల్యే దానం నాగేందర్
ఖైరతాబాద్, డిసెంబర్ 11 : సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం, నగరం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ దేశంలో అగ్రస్థానంలో విరాజిల్లుతున్నదని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. సోమాజిగూడ డివిజన్లోని బీఎస్ మక్తాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. బీఎస్ మక్తాలో రూ.18.70లక్షల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్డు పనులు, హరిగేట్, ప్రభుత్వ పాఠశాలలో రూ.5లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన పవర్ బోర్ను ఎమ్మెల్యే, స్థానిక కార్పొరేటర్ వనం సంగీతా యాదవ్, హైదరాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ కె. ప్రసన్నరామ్మూర్తితో కలిసి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందంజలో తీసుకెళ్తామన్నారు. ఇప్పటికే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా లబ్ధిదారులకు కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశామన్నారు. అంతేకాకుండా ప్రతి పేదవాడికి సొంతింటి కళ సాకారం కావడానికి ప్రభుత్వం రెండు పడకల గదుల ఇండ్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు. వర్షా కాలంలో ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని బీఎస్, ఎంఎస్ మక్తాలో డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకున్నామన్నారు. నియోజకవర్గంలోని డివిజన్లలో పెండింగ్లో ఉన్న పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. టీఆర్ఎస్ నాయకులు వనం శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు ఎస్కె అహ్మద్, ప్రధాన కార్యదర్శి పి. నాగరాజు, మహిళా విభాగం అధ్యక్షురాలు నాగలక్ష్మి, బీసీ, ఎస్సీ, మైనార్టీ, ఐటీ సెల్ అధ్యక్షులు ఆనంద్ గౌడ్, శ్రీనివాస్, ఫేరోజ్, సాదిక్, ఎండీ అజారుద్దీన్, సలావుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.