మియాపూర్, ఆగస్టు 24 : కరోనా వంటి విపత్కర పరిస్థితులు నెలకొన్నా.. ఓ వైపు ప్రజారోగ్యాన్ని కాపాడుకుంటూనే మరోవైపు ప్రజల సౌకర్యం కోసం సమగ్రాభివృద్ధితో ముందుకు సాగుతున్నట్లు ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ తోడ్పాటుతో అభివృద్ధిలో ఏమాత్రం లోటు రానివ్వకుండా చూసుకుంటున్నామన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం కూకట్పల్లి డివిజన్ ఆస్బెస్టాస్ కాలనీలో రూ.1.17కోట్లతో చేపట్టనున్న యూజీడీ, సీసీ రోడ్డు పనులకు కార్పొరేటర్లు జూపల్లి సత్యనారాయణ, దొడ్ల వెంకటేశ్ గౌడ్, మాజీ కార్పొరేటర్ రంగారావు, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి విప్ అరెకపూడి గాంధీ మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో మౌలిక వసతుల కల్పన లక్ష్యంగా పనులను చేపడుతున్నామని, రహదారులు, తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ సౌకర్యాలను కల్పిస్తున్నట్లు వెల్లడించారు.
ముంపు సమస్యల్లేకుండా వరద నీటి కాలువలు, మురుగు సమస్యల్లేకుండా డ్రైనేజీ వ్యవస్థ, దుర్వాసనలు రాకుండాఎస్టీపీలు సహా మరెన్నో అభివృద్ధి పనులను చేపడుతున్నామని విప్ గాంధీ తెలిపారు. కరోనాతో రెండేండ్లుగా ఇబ్బందులు నెలకొన్న.. అభివృద్ధిలో ఎక్కడా వెనకడుగు వేయటం లేదన్నారు. ప్రజలకు మెరుగైన రవాణా వసతి కోసం సౌకర్యవంతమైన రహదారుల నిర్మాణాలను చేపడుతున్నామన్నారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించి సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కరోనా నేపథ్యంలో ప్రజలు సైతం తగిన జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యాలను కాపాడుకోవాలని విప్ గాంధీ పిలుపునిచ్చారు.
అనంతరం కాలనీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికై కార్పొరేటర్లు, అధికారులతో కలిసి ఆస్బెస్టాస్ కాలనీలో విప్ గాంధీ పాదయాత్ర చేపట్టారు. కాలనీలో డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్ వంటి సమస్యలను స్థానికులు విప్ గాంధీ దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలన్నింటినీ దశలవారీగా పరిష్కరించి కాలనీని అభివృద్ధి పరుస్తామన్నారు. తన పూర్తి తోడ్పాటును ఎల్లప్పటికీ కాలనీకి అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఈఈ గోవర్ధన్, ఏఈ శివప్రకాశ్, పార్టీ నేతలు సంజీవరెడ్డి, జిల్లా గణేశ్, నాగేశ్వర్రావు, ప్రసాద్, ఖయ్యూమ్, కాశీనాథ్, మోహన్, హర్షద్, రఫిక, జ్యోతి, రాధాబాయి, కాలనీ వాసులు పాల్గొన్నారు.