ఈ నెల 7న జలవిహార్లో హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల స్థాయి టీఆర్ఎస్ పార్టీ జనరల్ బాడీ సమావేశం జరుగుతుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం జలవిహార్లో టీఆర్ఎస్ పార్టీ జనరల్ బాడీ సమావేశం నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. మంగళవారం ఉదయం 10.30 గంటలకు జరిగే ఈ సమావేశానికి పార్టీ వరింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. అంతేకాకుండా నగర పరిధిలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు,
కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, పార్టీ ముఖ్య నాయకులు, డివిజన్ల అధ్యక్షులు తదితరులు
పాల్గొంటారని వివరించారు.
టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసేందుకు త్వరలో చేపట్టనున్న బూత్, డివిజన్, నగర కమిటీల నియామకంపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ నెల 7న జలవిహార్లో దిశానిర్దేశం చేయడంతో పాటు, పార్టీ ఆధ్వర్యంలో భవిష్యత్లో చేపట్టనున్న కార్యక్రమాల గురించి సమీక్షించడం జరుగుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. 60 లక్షల సభ్యత్వాలతో దేశంలోనే టీఆర్ఎస్ అతిపెద్ద పార్టీగా గుర్తింపు సాధించిందని పేరొన్నారు. తెలంగాణ ప్రాంతం అన్ని రంగాల్లో అన్యాయానికి గురవుతున్న నేపథ్యంలో స్వయం పాలనతోనే మన ప్రాంత అభివృద్ధి సాధ్యమని, అది తెలంగాణ రాష్ట్రంలోనే జరుగుతుందని భావించిన కేసీఆర్ నాయకత్వంలో 2001 సంవత్సరంలో టీఆర్ఎస్ పార్టీ ఏర్పడిందని వివరించారు.
పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో నాటి ఉద్యమనాయకుడు నేటి సీఎంగా ఉన్న కేసీఆర్ నాయకత్వంలో గడిచిన ఏడేండ్లలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారన్నారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి దిక్సూచిగా నిలిచిందని తెలిపారు. కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతల, మల్లన్న సాగర్, కొండపోచమ్మ వంటి సాగునీటి ప్రాజెక్ట్ల నిర్మాణం, పేద ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం, రైతులకు పంట పెట్టుబడి కోసం రైతుబంధు, భూగర్భ జలాలను పెంచేందుకు మిషన్ కాకతీయ కింద చెరువుల్లో పూడిక తీయడం వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు. కాని ఇతర పార్టీల నేతలు కండ్లు ఉన్న కబోదులుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎంఎన్ శ్రీనివాస రావు, ఆనంద్కుమార్ గౌడ్, గుర్రం పవన్కుమార్ గౌడ్, అత్తిలి శ్రీనివాస్ గౌడ్, సామా ప్రభాకర్ రెడ్డి, ఆకుల హరికృష్ణ, నరేందర్ నాయి తదితరులు ఉన్నారు.