మియాపూర్, జూలై 22: రెండో భార్యకు విడాకులు ఇచ్చినట్లు నకిలీ పత్రాలు సృష్టించి మూడో పెండ్లి చేసుకున్న ఓ భర్తకు కోర్టు మూడేండ్లు జైలు శిక్షతో పాటు రూ.10 వేలు జరిమానా విధించింది. మియాపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మియాపూర్కు చెందిన స్వరూపా రాణిని లక్ష్మీకాంత్ గౌడ్ వివాహం చేసుకున్నాడు.
అప్పటికే వివాహం కాగా మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన లక్ష్మీకాంత్ రెండో భార్యతోనూ చెన్నై కోర్టు నుంచి విడాకులు వచ్చినట్లు నకిలీ పత్రాలు సృష్టించాడు. వాటిని చూపి స్వరూపారాణిని పెండ్లి చేసుకున్నాడు. కొంత కాలం తరువాత విషయం తెలుసుకున్న స్వరూపారాణి 2017లో భర్త లక్ష్మీకాంత్పై మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. అప్పటి ఎస్ఐ లింగ్యానాయక్ విచారణ చేపట్టి అతడిపై ఛార్జీ షీట్ దాఖలు చేశారు. సదరు కేసును ట్రయల్ చేసిన 8వ ఎంఎం కోర్టు న్యాయమూర్తి భవానీ లక్ష్మీకాంత్కు మూడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.10 వేలు జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పునిచ్చారు. ఏపీపీ గోపాల్ పోలీస్ తరఫున సాక్ష్యులను విచారించినట్లు మియాపూర్ పోలీసులు తెలిపారు.