సిటీబ్యూరో, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): రుణ యాప్ల ద్వారా భారీ ఎత్తున దేశంలో సైబర్దోపిడీకి పాల్పడ్డ కొందరు చైనీయులు.. ఇప్పుడు పెట్టుబడుల పేరుతో అప్లికేషన్లు తయారు చేసి భారీ మోసాలకు తెరలేపారు. ఆదివారం సిటీ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిన శ్రీనివాస్రావు, విజయ కృష్ణలను విచారించగా, చైనా లింక్లు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. రుణ యాప్లకు సంబంధించిన కాల్ సెంటర్లలో పనిచేసిన ఉద్యోగులతోనే చైనీయులు దేశంలో కంపెనీల పేర్లు రిజిస్ట్రేషన్ చేయించి, వాటి ద్వారా బ్యాంకు ఖాతాలు తెరిపిస్తున్నారు. ఈ తతంగం పూర్తి చేసే వారికి ఒక్కొక్కరికీ రూ. 7500 ఇస్తున్నట్లు వెల్లడైంది.
రుణ యాప్లకు సంబంధించిన కేసులో సైబర్క్రైమ్ పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఇందులో 26 మందిని అరెస్ట్ చేయగా, అందులో ఇద్దరు చైనీయులు ఉన్నారు. అప్పుల యాప్లకు సంబంధించి రూ. 19 వేల కోట్ల ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు తేల్చారు. చైనాకు చెందిన మైఖెల్, జోలి ఇద్దరు మాదాపూర్ లోని థైయ్మౌంట్ కంపెనీకి అనుబంధంగా ఒక కాల్ సెంటర్ నిర్వహించారు. ఇందులో అడబాల శ్రీనివాసరావు అకౌంటెంట్గా పనిచేశాడు. 2020 జనవరి నుంచి 2021 జనవరి వరకు ఈ కాల్సెంటర్ కొనసాగింది. ప్రజల్లో అవగాహన రావడం.. పోలీసులు పటిష్ట నిఘా పెట్టడంతో దానిని మూసేశారు. ఆ సమయంలో ఈ కాల్సెంటర్ వ్యవహారంతో పాటు మైఖెల్, జోలి పేర్లు కూడా ఎక్కడా బయటపడలేదు. నగర పోలీసులు అరెస్ట్ చేసిన ల్యాంబోతో పాటు జెన్నిఫర్ల పేర్లు మాత్రం వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు మరో ఇద్దరి పేర్లు తెరపైకి రావడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
కాల్సెంటర్ కొనసాగుతున్న సమయంలో శ్రీనివాస్రావు అకౌం టెంట్గా పనిచేశాడు. ఆ సమయంలో చైనీయులైన మైఖెల్, జోలిలతో తరచూ వాట్సాప్లో మాట్లాడే వాడు. నమ్మకస్తుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కాల్సెంటర్ మూసేసిన తరువాత, మైఖెల్, జోలి వాట్సాప్లో శ్రీనివాస్రావును పలుకరించారు. మాకున్న వెబ్సైట్లు యాప్లకు సంబంధించి బిల్లులు వస్తుంటాయి. వాటిని భారత్లోని బ్యాంకు ఖాతాలలోనే డిపాజిట్ చేయాలి, ఇందుకు మీ సహకారం కావాలని వారు కోరారు. ప్రతిఫలంగా రూ. 15 వేలు ఇస్తామంటూ ఒప్పందం చేసుకున్నారు. దీంతో శ్రీనివాస్రావు తన స్నేహితుడైన విజయ్ కృష్ణకు ఈ విషయం చెప్పి వచ్చిన దాంట్లో చెరోసగం తీసుకుందామని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా ఇద్దరు కలిసి వాళ్లు సూచించిన కంపెనీల పేర్లు రిజిస్ట్రేషన్ చేసి, వాటి పేరుపై బ్యాంకు ఖాతాలు తెరిపించి, ఆ వివరాలను వాళ్లకు పంపించారు. మాల్008.కామ్ యాప్ పేరుతో నగర యువతిని రూ. 2.5 లక్షలు మోసం చేసిన ఘటనపై దర్యాప్తు చేస్తుండగా, ఈ డొంకంతా కదలింది. అరెస్ట్ చేసిన ఇద్దరు ఇతర బ్యాంకు ఖాతాలు తెరిచారా? కేవలం ఈ యాప్కే పరిమితమయ్యారా? ఇలా వివిధ అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.