సిటీబ్యూరో, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని గచ్చిబౌలి, రాయదుర్గం ప్రాంతాల్లో ఉన్న పలు ప్రధాన ట్రాఫిక్ కూడళ్లను జాయిం ట్ సీపీ (ట్రాఫిక్) సన్ప్రీత్సింగ్ ట్రాఫిక్ అధికారులతో కలిసి సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించి వాహనాల రాకపోకలను సాఫీగా సాగించేందుకు చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీచేశారు.
జర్నలిస్ట్స్ కాలనీ కమాన్ వద్ద యూటర్న్ ఏర్పాటు, అపర్ణ శాంగ్రిలా-గౌలిదొడ్డి మార్గంలో రహదారి విస్తరణ, మరమ్మతులు చేపట్టాలని అధికారులకు సూచించారు. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా విప్రో జంక్షన్ వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఏర్పాటు, రహదారి పకన పెరిగిన చెట్ల కొమ్మలను తొలగించడం, ఫ్రీ లెఫ్ట్లను విస్తరించడం వంటి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గౌలిదొడ్డి- నానక్ రామ్ గూడ -ఐఐఐటీ- ఐసీఐసీఐ మార్గంలో ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని సూచించారు.
వాహనాలను వేర్వేరు మార్గాల్లోకి మళ్లించడం, అవసరం లేని యూటర్న్లను తగ్గించడం, నిరంతరాయంగా ట్రాఫిక్ సాగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. వంశీరామ్ బీఎస్ఆర్ టవర్స్ నుంచి మేడికుంట అంచు మీదుగా మంత్రి కన్స్ట్రక్షన్స్ రోడ్డుకు ప్రత్యామ్నాయ మార్గాన్ని అభివృద్ధి చేసే అంశాన్ని జాయింట్ సీపీ అధికారులతో ఆరాతీశారు.
ఐటీసీ కోహినూర్ వద్ద కొనసాగుతున్న పనులను పరిశీలించిన ఆయన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. పాదచారులు రోడ్డు దాటేందుకు నిర్దేశించిన ప్రాంతాల్లో సరైన సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని, సురక్షిత రాకపోకల కోసం ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను వినియోగించేలా ప్రజలకు స్పష్టమైన మార్గనిర్దేశం చేయాలని టీజీఐఐసీ అధికారులకు సూచించారు. ఆయన వెంట ఎస్సీఎస్సీ సీఈవో నవేద్ ఖాన్, ఏసీపీడీపీ టి.హన్మంతరావు, గచ్చిబౌలి, రాయదుర్గం ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు.