సిటీబ్యూరో, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : వైవిధ్యమైన చిత్రాలతో కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరిస్తున్నారు హైదరాబాద్ గృహిణులు. ప్రకృతి, ఆధ్యాత్మికం మానవ విలువలు, పల్లె వాతావరణం ఇలా వివిధ థీమ్స్పై అందమైన పెయింటింగ్స్ వేస్తూ.. అబ్బురపరుస్తున్నారు. బాధ్యతలు పెరిగినా.. లక్ష్యం దిశగా సాగాలని హితబోధ చేస్తున్నారు. దేశ, విదేశాల్లో చిత్రకళలో రాణిస్తున్న నగరానికి చెందిన ఆ మహిళా ఆర్టిస్టులపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం.
చిన్నప్పటి నుంచే..
నగరానికి చెందిన ప్రసన్న పెయింటింగ్ టీచర్. ఆమెకు చిన్నప్పటి నుంచే ఆర్ట్ అంటే ప్రాణం. ఢిల్లీ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, చెన్నై తదితర రాష్ర్టాల్లో జరిగిన ఆర్ట్స్ ప్రదర్శనల్లో పాల్గొని పలు బహుమతులు, ప్రశంసలు అందుకున్నారు. ‘వివాహం అయ్యాక చాలా మంది మహిళలు తమ లక్ష్యాన్ని పక్కనపెట్టి ఇంటి బాధ్యతలో నిమగ్నమవుతారు. అది సహజం. మన గమ్యం బలమైనది అయితే కచ్చితంగా మన కలలను సాకారం చేసుకోవడానికి ప్రత్యామ్నాయ ప్రపంచాన్ని సృష్టించుకోగలం.’ అని అన్నారు ప్రసన్న.
అన్యాయాలను నిర్మూలించేలా..
మహిళలపై జరుగుతున్న అన్యాయాలను నిర్మూలించేలా సందేశాత్మక పెయింటింగ్స్ వేస్తుంటారు నగరానికి చెందిన గ్లోబల్ ఆర్టిస్టు ప్రింకిల్ మెహతా. దేశ, విదేశాల్లోనూ తన చిత్ర కళతో సత్తా చాటారు. ఆమె గీసిన ప్రతి చిత్రంలో మహిళా శక్తి దాగి ఉండేలా ఉంటుంది. సంతోషం, బాధ, భయానకం, తీవ్రమైన ఆలోచనలు ఇలా అనేక కోణాల్లో పెయింటింగ్స్ వేశారు. ఇటీవల జరిగిన బెంగళూరు ఇండియన్ ఆర్ట్ ఫెస్టివల్, పుణెలో జరిగిన మెనాలిసా కలాగ్రామ్, థాయిలాండ్లో జరిగిన ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్, ఆస్ట్రేలియాలో జరిగిన ఆర్ట్ కాన్సెప్ట్ కాంపిటీషన్లో పాల్గొని హైదరాబాద్ సత్తా చాటారు. ‘వివాహంతో మన జీవితం ఆగిపోకూడదు. మరింత వేగంగా మన లక్ష్మాన్ని నిర్మించుకోవాలి.. అప్పుడే గృహిణులు సక్సెస్ అవుతారు.’ అని చెప్పారు.
ఆధ్యాత్మిక పెయింటింగ్లో..
నగరానికి చెందిన ఆయేషా ఆధ్యాత్మిక పెయింటింగ్లో ఎక్స్పర్ట్. ఆమె ప్రతి చిత్రంలో భక్తి పారవశ్యం తొణికిసలాడుతుంది. ప్రముఖ దేవాలయాలు, హిందూ దేవుళ్లు, ప్రకృతి, సంప్రదాయాలు, గ్రామీణ వాతావరణంలో నమ్మకాలు ఇలా అన్నింటిపై చిత్రాలను ఆవిష్కరించారు. దేశ వ్యాప్తంగా ఆమె అనేక ఆర్ట్ క్యాంపుల్లో పాల్గొని అనేక బహుమతులు, ప్రశంసా పత్రాలు అందుకున్నారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఆర్ట్ క్యాంప్లోనూ ప్రతిభ చాటారు. ఎన్ని బాధ్యతలు ఉన్నప్పటికీ మన లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలని ఆమె చెప్పారు.
నగరానికి చెందిన భారతికేర్కు పెయింటింగ్ అంటే చాలా ఇష్టం. కాంపిటీషన్ ఏదైనా అవార్డు వరించాల్సిందే. ప్రాచీన ఆలయాల పరిస్థితి, అందులోని దేవుళ్ల నిర్మాణాలపై ఆమె గీసిన చిత్రాలు అచ్చు మన కండ్ల ముందు కదలాడుతున్నట్టుగానే ఉంటాయి. నిజంగా చెక్కిన నిర్మాణాల వలే దర్శనమిస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో మూఢనమ్మకాలపై వేసిన చిత్రాలు సందేశాత్మకంగానూ ఉన్నాయి. ఒక్క రూపంలో స్త్రీ, పురుష శక్తులు ఉంటాయని గీసిన చిత్రం ప్రశంసలు అందుకుంది. ఇటీవల మధ్యప్రదేశ్లో జరిగిన కళా సన్యోజన కాంపిటీషన్లో అవార్డును దక్కించుకున్నారు. ‘వివాహం అనేది కొత్త జీవితాన్ని పరిచయం చేస్తుంది. కానీ లక్ష్యానికి కొత్త, పాత అంటూ ఏమీ ఉండదు. అది ఒకేలా ఉంటుంది. నాకు నా ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉంది. అందుకే నేను నా లక్ష్యం నెరవేర్చుకుంటున్నాను.’ అని భారతీకేర్ తెలిపారు.
తేజస్వి.. తేజోభరితం..
నగరానికి చెందిన తేజస్వి పూజారికి చిన్నప్పటి నుంచి పెయింటింగ్ అంటే చాలా ఇష్టం. ఐదేండ్ల వయస్సులోనే స్కూల్లో ఆమె ఆర్ట్ కాంపిటీషన్లో బహుమతి అందుకున్నారు. ప్రస్తుతం ఆమె క్లినికల్ రీసెర్చ్ అసోసియేట్ గా పనిచేస్తున్నారు. మరోవైపు తన పెయింటింగ్ ఆసక్తిని కొనసాగిస్తున్నారు. ‘కోలర్ కోవెల’ అనే స్టూడియోను స్థాపించి.. 2019లో వెబ్ సైట్ ను ప్రారంభించారు. ఆమె కళాఖండాలు ఇతర రాష్ర్టాల్లోని వివిధ ఎక్స్పోలు, ఈవెంట్లు, అంతర్జాతీయ ఆన్లైన్ ఎగ్జిబిషన్లలో కూడా ఆదరణను దక్కించుకున్నాయి. ఈ-కామర్స్ వెబ్సైట్లలోనూ ఆమె పెయింటింగ్స్ అందుబాటులో ఉన్నాయి. ‘చాలా మంది మ్యారేజీ అయ్యాక ఇల్లు, ఉద్యోగం బాధ్యతల వల్ల తమ లక్ష్యాలను పక్కనపెడుతుంటారు. అయితే ప్రణాళికను పక్కాగా ఏర్పాటు చేసుకుంటే కలలను సాకారం చేసుకోవచ్చు’ అని తేజస్వి పూజారి అన్నారు.
గాయత్రి.. ఆర్ట్లో దిట్ట..
నగరానికి చెందిన గాయత్రి విభిన్న రకాల పెయింటింగ్స్తో ఆకట్టుకుంటున్నారు. ఢిల్లీ, కర్ణాటక, రాజస్తాన్ తదితర రాష్ర్టాల్లో జరిగిన ఆర్ట్ క్యాంపుల్లోనూ పాల్గొన్నారు. అనేక బహుమతులు, సన్మానాలు అందుకున్నారు. ‘మన విజయానికి వివాహం అడ్డురాదు. కాకపోతే కొన్ని బాధ్యతలు పెరుగుతాయి. వాటిని మనం అనుకూలంగా మలుచుకోవడం తెలుసుకోవాలి. మన లక్ష్యం నెరవేర్చుకోవడానికి కృషి చేయాలి.’ అని గాయత్రి చెప్పారు.