సిటీబ్యూరో, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): మెహిదీపట్నంలో పాదచారుల ట్రాఫిక్ కష్టాలు త్వరలోనే తీరనున్నారు. నిత్యం అత్యంత రద్దీగా మారిన ఈ ప్రాంతంలో దశాబ్దాల నాటి పాదచారుల కష్టాలను తీర్చేందుకు రూ.34 కోట్ల వ్యయంతో సుమారు 380 మీటర్ల పొడవుతో కూడిన స్కైవాక్ నిర్మాణానికి హెచ్ఎండీఏ చర్యలు చేపట్టింది. ఇప్పటికే రైతు బజార్కు ఇరువైపులా ఫౌండేషన్తో పాటు పిల్లర్లను నిర్మించారు.
ఆసిఫ్నగర్, గుడిమల్కాపూర్ కూడలి నుంచి టోలిచౌకి వైపు వెళ్లే మార్గంలో పిల్లర్లపై స్టీల్తో రూపొందించిన డెక్లను బిగిస్తున్నారు. అయితే పీ.వీ.ఎక్స్ప్రెస్ వే మీదుగా ఫుట్ ఓవర్ బ్రిడ్జిని నిర్మించి స్కైవాక్తో కలపాల్సి ఉండగా రక్షణ శాఖ అభ్యంతరం తెలుపడంతో పనుల్లో కొంతమేర జాప్యం జరుగుతున్నది. పీ.వీ.ఎక్స్ప్రెస్ వే ఒక వైపు మినహా మిగతా యూ ఆకారంలో పనులను హెచ్ఎండీఏ శరవేగంగా నిర్వహిస్తున్నది. రక్షణ శాఖ నుంచి పూర్తి స్థాయిలో అనుమతి వస్తే 3-4 నెలల్లో మెహిదీపట్నం స్కై వాక్ నిర్మాణం పూర్తి చేసి పాదచారులకు అందుబాటులోకి తీసుకువస్తామని హెచ్ఎండీఏ అధికారులు పేర్కొంటున్నారు.