ఉప్పల్ భగాయత్ లే అవుట్లో మిగిలిపోయిన ప్లాట్లను విక్రయించేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఈ లే అవుట్లోని ప్లాట్ల విక్రయానికి అధికారులు రెండుసార్లు వేలం వేశారు. అయితే మరికొన్ని స్థలాలు మిగిలిపోగా వాటిని గుర్తించిన అధికారులు క్షేత్రస్థాయిలో మార్కింగ్ చేశారు. ప్రత్యేకంగా బోర్డులు పెట్టారు. ఇప్పటికే కోకాపేటలో అభివృద్ధి చేస్తున్న నియోపోలిస్ లేఅవుట్లో ప్లాట్లను విక్రయించి ప్రభుత్వానికి రూ.2వేల కోట్ల వరకు ఆదాయాన్ని హెచ్ఎండీఏ తెచ్చి పెట్టింది. తాజాగా ఉప్పల్ భగాయత్ ఉన్న ప్లాట్లతో పాటు నగర శివారులో గతంలో అభివృద్ధి చేసినప్లాట్లను సైతం గుర్తించి ఆన్లైన్లోనే విక్రయించాలని హెచ్ఎండీఏ అధికారులు నిర్ణయించారు.
హెచ్ఎండీఏ ఆధీనంలో ఉన్న ప్లాట్లు కబ్జాకు గురి కాకుండా ఉండేందుకు అధికారులు క్షేత్ర స్థాయిలో చర్యలు చేపట్టారు. ముఖ్యంగా హెచ్ఎండీఏ ఉప్పల్ భగాయత్తో పాటు ఇతర ప్రాంతాల్లో అభివృద్ధి చేసిన లే అవుట్లలో ప్లాట్లు (ఖాళీ స్థలాలు) నిరుపయోగంగా ఉన్నాయి. వీటిని ప్రభుత్వ అవసరాలకు ఉపయోగించలేని పరిస్థితి ఉండడంతో విక్రయించాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వ అనుమతి కోసం హెచ్ఎండీఏ అధికారులు వేచి చూస్తున్నారు. అనుమతి రాగానే ఆన్లైన్లో విక్రయించేందుకు ప్రత్యేకంగా షెడ్యూల్ ఖరారు చేయనున్నారు.
తాజాగా హెచ్ఎండీఏ విక్రయానికి ఉంచిన ప్లాట్ల విస్తీర్ణం 15వేల గజాలకు పైగానే ఉంటుందని సమాచారం. కేవలం ఉప్పల్ భగాయత్ లేఅవుట్లో సుమారు 40 ప్లాట్లు అమ్మకానికి ఉండగా వాటి విస్తీర్ణం 8-9 వేల గజాలు. ఇక శివారు ప్రాంతాల్లో గతంలో హుడా అభివృద్ధి చేసిన లే అవుట్లలో ఉన్న ప్లాట్ల విస్తీర్ణం మరో 5-6 వేల వరకు ఉంటుంది. ముఖ్యంగా శివారు ప్రాంతాలైన అత్తాపూర్, చందానగర్, మైలార్దేవ్పల్లి, నల్లగండ్ల, వనస్థలిపురం, నెక్నంపూర్, తెల్లాపూర్ ప్రాంతాల్లో 16 ప్లాట్లు ఉండగా, వాటి మొత్తం విస్తీర్ణం సుమారు 5500 గజాల వరకు ఉంటుందని ఓ అధికారి తెలిపారు. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లోని ప్లాట్లకు మంచి డిమాండ్ ఉండడంతో వేలం వేసేందుకు ఇది సరైన సమయమని గుర్తించి హెచ్ఎండీఏ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.