
సిటీబ్యూరో, జూలై 3 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలోని డాగ్ బ్రీడర్స్ (కుక్కల పెంపకం దారులు, అమ్మకం దారులు) అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ అధికారులను ఆదేశించారు. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ జంతువుల క్రూరత్వ నిరోధక చట్టం-2017 నిబంధనలకు లోబడి డాగ్ బ్రీడర్స్ కార్యకలాపాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్దేశించారు.బ్రీడింగ్ యాక్టివిటీలో ఉన్న వారు స్టేట్ ఎనిమల్ వెల్ఫేర్ బోర్డులో రిజిస్ట్రేషన్ కలిగి ఉండేలా డాగ్ బ్రీడర్స్కు అవగాహన కల్పించాలని సూచించారు. దీనికి సంబంధించి శనివారం పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్లకు లేఖలు రాశారు.
డాగ్ బ్రీడింగ్ యాక్టివిటీ చేసే వారందరూ స్టేట్ ఎనిమల్ వెల్ఫేర్ బోర్డులో రిజిస్ట్రేషన్ చేసుకునేలా 4వారాల గడువు కల్పించి,రిజిస్ట్రేషన్కు వారికి సహకరించాలని లేఖలో సూచించారు.ఆన్లైన్ ద్వారా కుక్క పిల్లల క్రయవిక్రయాలకు స్టేట్ ఎనిమల్ వెల్ఫేర్ బోర్డులో రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసుకోవాలన్నారు.ఆన్లైన్లో జరిగే ఇలాంటి లావాదేవీలు, వ్యాపారాలపై ఐటీ శాఖ నిఘా వేసి కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్య కార్యదర్శికి సూచించారు. నిబంధనలు పాటించని వారి కార్యకలాపాలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించారు. ఇందుకోసం పశుసంవర్ధక శాఖ డైరెక్టర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (సీడీఎంఏ) డైరెక్టర్, హైదరాబాద్, సైబరాబాద్,రాచకొండ పోలీస్ కమిషనర్ల సహకారంతో రిజిస్ట్రేషన్ లేని డాగ్ బ్రీడర్స్పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఈ అంశంపై ఎలాంటి చర్యలు తీసుకున్నారనే వివరాలను ఆగస్టు 15వ తేదీలోగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని లేఖలో కోరారు.