బహుళ అంతస్థులు, సాధారణ నిర్మాణాల కోసం జరిపే సెల్లార్ తవ్వకాలను జీహెచ్ఎంసీ నిషేధించింది. వానకాలం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా ముందస్తుగా ఈ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ నెలాఖరు వరకు ఈ నిషేధం ఉత్తర్వులు అమల్లో ఉంటాయని, ఎవరైనా ధిక్కరించి తవ్వకాలు చేపడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని కమిషనర్ లోకేశ్కుమార్ రెండురోజుల కిందట జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్లార్ ప్రమాదాలు చోటు చేసుకోవద్దని, ఈ నిషేధాన్ని పక్కాగా అమలు చేయాలని అన్ని సర్కిళ్ల జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు. అలాగే నగరవ్యాప్తంగా గతేడాది కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న 215 భవనాలతోపాటు పురాతన భవనాలను తనిఖీ చేసి ప్రమాదకరంగా ఉన్న భవనాల యజమానులకు నోటీసులు జారీ చేయనున్నారు. ఈ భవనాల తొలగింపునకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు శిథిల భవనాలు, సెల్లార్ తవ్వకాలపై పాటించాల్సిన మార్గదర్శకాలను విడుదల చేశారు.
వర్షాకాలం నేపథ్యంలో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. ప్రమాదాలు జరుగకుండా సెల్లార్ తవ్వకాలపై మూడు నెలల నిషేధాన్ని విధిస్తూ.. కీలక నిర్ణయం తీసుకున్నది. నిబంధనలు పాటించకపోతే యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించింది. ఈ మేరకు కమిషనర్ లోకేశ్కుమార్ రెండ్రోజుల కిందట ఉత్తర్వులు జారీ చేయగా, తక్షణం అమల్లోకి వచ్చింది. అయితే ఇప్పటికే తవ్వకాలు జరిపి ఉంటే వానాకాలం పూర్తయ్యే వరకు వాటి వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ.. యజమానులను నోటీసులు జారీ చేయాలని నిర్ణయించారు. ఎట్టి పరిస్థితుల్లో సెల్లార్ ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఉండడమే లక్ష్యంగా ఈ నిషేధాన్ని పక్కాగా అమలు చేయాలని సంకల్పించారు. అలాగే కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న 215 భవనాలతో పాటు పురాతన భవనాలను తనిఖీలు చేసి.. ప్రమాదకరంగా ఉంటే నోటీసులు జారీ చేస్తారు.