నగర పారిశుధ్య కార్యక్రమాల్లో స్థానికులు, కాలనీ, బస్తీ సంక్షేమ సంఘాల భాగస్వామ్యం కల్పించే పరిచయ కార్యక్రమాన్ని జీహెచ్ఎంసీ తిరిగి పునరుద్ధరించింది. ఇందులో భాగంగా జీహెచ్ఎంసీకి చెందిన సిబ్బంది ప్రతి రోజూ తమ పరిధిలోని నగర వాసులను నేరుగా కలిసి పరిచయం చేసుకుంటారు. ఈ కార్యక్రమం ద్వారా క్షేత్ర స్థాయిలో పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణను పర్యవేక్షించే అవకాశం ఏర్పడుతుంది. మరింత సమర్థవంతంగా స్వచ్ఛ కార్యక్రమాలు అమలై.. ఉన్నతాధికారులకు ఫిర్యాదులు రావడం పూర్తిగా తగ్గే అవకాశం ఈ విధానం ద్వారా ఏర్పడుతుంది. గతంలో మంచి ఫలితాలు సాధించిన ఈ కార్యక్రమాన్ని తిరిగి పునరుద్ధరించాలని మంత్రి కేటీఆర్ ఆదేశించడంతో ముమ్మరంగా నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. జీహెచ్ఎంసీలో ఉన్న సుమారు 21వేల మంది పారిశుధ్య, ఎంటమాలజీ సిబ్బంది తాము విధులు నిర్వహించే ప్రాంతాల్లోని ప్రజలను కలిసి తమకు తాము పరిచయం చేసుకోవడంతో పాటు సెల్ఫోన్ నంబరు, తమ పర్యవేక్షణ అధికారి వివరాలు అందజేయడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని అధికారులు పేర్కొన్నారు.
గ్రేటర్ హైదరాబాద్లో నగర వాసుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన పబ్లిక్ టాయిలెట్లలోని పైపులు, నల్లా, వాటర్ ట్యాంకర్లు, ఫ్లష్ డోర్లను దుండగులు చోరీ చేస్తున్నారు. అలాంటి వారిని గుర్తించి.. కేసులు నమోదు చేయాలని క్షేత్ర స్థాయి అధికారులను జీహెచ్ఎంసీ ఆదేశించింది. అలాగే దొంగతనానికి గురైన పరికరాలను వెంటనే అమర్చి టాయిలెట్లను వినియోగంలోకి తేవాలని సూచించింది.