సిటీబ్యూరో, సెప్టెంబర్ 25(నమస్తే తెలంగాణ) : మారుతున్న కాలంతోపాటు ప్రజల జీవన విధానం, ఆహార అలవాట్లు కూడా మారిపోతున్నాయి. ఫలితంగా రోగాల సంఖ్య, కొత్త రకమైన వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. ప్రధానంగా క్యాన్సర్ రోగుల సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది. అదే సమయంలో వైద్యరంగం కూడా ఎప్పటికప్పుడు కొత్తపుంతలు తొక్కడమే కాకుండా వ్యాధికి గల కారణాలు, వ్యాధి వచ్చే అవకాశాలను ముందుగానే తెలుసుకోవచ్చు. క్యాన్సర్ మూలాలను ముందే తెలుసుకునే అధునాతన పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. ఈ రకమైన ఖరీదైన జెనటికల్ పరీక్షలు ప్రస్తుతం కార్పొరేట్ దవాఖానల్లోనే లభిస్తుండగా, త్వరలో ప్రభుత్వ ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీజినల్ రీసెర్చ్ సెంటర్లో కొత్తగా నిర్మిస్తున్న భవనం ప్రాంగణంలో జన్యు అంకాలజీ విభాగాన్ని అందుబాటులోకి తేనున్నట్లు దవాఖాన డైరెక్టర్ డాక్టర్ జయలత తెలిపారు. రొమ్ము క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, లుకేమియా, మెదడులో కణతులు, బోన్ క్యాన్సర్ వంటివాటిని జన్యు ఆంకాలజీ ద్వారా ముందే గుర్తించొచ్చన్నారు. సుమారు రూ.50 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న ఈ విభాగం అందుబాటులోకి వస్తే క్యాన్సర్ వ్యాధుల మూలాలతోపాటు వ్యాధి రాకను ముందే గుర్తించి క్యాన్సర్ బారిన పడకుండా కాపాడవచ్చని చెప్పారు.